Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సొంతంగా గనులు లేకనే పెరిగిన ఉత్పత్తి ఖర్చు
- కాకినాడలో పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు చేయండి
- బియ్యం పంపిణీ పరిమితితో ఏపీ తీవ్ర అన్యాయం
- 3,229 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించండి
- కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, పీయుశ్ గోయల్తో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ
న్యూఢిల్లీ : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర పెట్రోలియం, సహజ వాయువులు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో ఆయన నివాసంలో ఏపీ ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఇరువురి మధ్య గంటకుపైగా సమావేశం జరిగింది. కాకినాడలో పెట్రో కాంప్లెక్స్, విశాఖ స్టీల్ ప్లాంట్ తదితర అంశాలపై చర్చ జరిగింది.
స్టీల్ ప్లాంట్ వల్ల దాదాపు 20 వేల మంది ఉద్యోగులు ప్రత్యక్షంగానూ, మరికొన్ని వేల మంది పరోక్షంగానూ ఉపాధి పొందుతున్నారని కేంద్ర మంత్రికి వివరించారు. విశాఖ ఉక్కు ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారనీ, ప్రజల త్యాగాల పునాదుల మీద ఈ ఫ్యాక్టరీ వచ్చిందని వైఎస్ జగన్ గుర్తు చేశారు.
స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలి
సొంతంగా గనులు లేకపోవడం వల్ల ఉత్పత్తి ఖర్చుకూడా విపరీతంగా పెరిగిపోయిందనీ, ప్లాంటు పునరుద్ధరణ కోసం పలు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని కేంద్ర మంత్రికి తెలిపారు. స్టీల్ ప్లాంట్కు సొంతంగా గనులు కేటాయించాలనీ, అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ రుణాలుగా మార్పులు చేయాలనీ, రుణాలను ఈక్విటీగా మార్చాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యం ఉన్న విశాఖపట్నం స్టీల్ప్లాంట్ 6.3 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతోనే పనిచేస్తున్నదనీ, డిసెంబర్ 2020 నుంచి నెలకు రూ.200 కోట్లు లాభాలను ఆర్జిస్తోందని తెలిపారు. ఇది ఇలాగే రెండేండ్లపాటు కొనసాగితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అన్నారు.
స్టీల్ ప్లాంట్పై రూ.3,472 కోట్ల అదనపు భారం
విశాఖ స్టీల్ప్లాంట్ ఇనుప ఖనిజాన్ని ఎన్ఎండీసీ నుంచి, బైలదిల్లా గనుల నుంచి మార్కెట్ ధరకు కొనుగోలు చేస్తున్నదనీ, టన్ను సుమారు రూ.5,260కు కొనుగోలు చేస్తుందని అన్నారు. పోటీ కంపెనీలు 60శాతం ఇనుప ఖనిజాన్ని సొంత గనుల నుంచే పొందుతున్నాయనీ, కాని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తుందని అన్నారు. సెయిల్కు సొంతంగా 200 సంవత్సరాలకు సరిపడా నిల్వలున్న గనులు ఉన్నాయని తెలిపారు. మార్కెట్ ధరకు కొనుగోలు చేయడం వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్పై రూ.3,472 కోట్ల అదనపు భారం పడుతున్నదని కేంద్ర మంత్రికి వివరించారు. ఒడిశాలో పుష్కలంగా ఉన్న ఇనుప ఖనిజం గనులను విశాఖ స్టీల్ప్లాంట్కు కేటాయించాలని కోరారు.
రుణాలను ఈక్విటీ రూపంలో మార్చాలి
విశాఖ స్టీల్ ప్లాంట్కు రూ.22వేల కోట్ల రుణాలు ఉండగా, వీటిపై 14శాతం అధిక వడ్డీని చెల్లించాల్సి వస్తున్నదనీ, ఈ రుణాలను ఈక్విటీ రూపం లో మార్చాలని వైఎస్ జగన్ కోరారు. స్టాక్ ఎక్చ్సేంజీలో నమోదు ద్వారా బ్యాంకులు తమ షేర్లు అమ్ముకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. తెలుగు ప్రజలకు గర్వకారణ మైన, రాష్ట్రానికి మకుటం లాంటి ఈ కంపెనీని కాపాడు కునే విషయంలో సంబంధిత కేంద్ర శాఖలతో కలిసి పనిచేయ డానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కరోనా రెండో వేవ్లో కూడా 7వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను విశాఖ స్టీల్ప్లాంట్ అందిం చిందనీ, లక్షల మంది ప్రాణాలు కాపాడిందని తెలిపారు.
కాకినాడలో పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు చేయండి
కాకినాడ ఎస్ఈజెడ్లో పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారనీ, హెచ్పీసీఎల్, గెయిల్ సంస్థలు కలిసి ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రూ.32,900 కోట్లు అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు డీపీఆర్ తయారు చేశాయని తెలిపారు.
వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఏడాదికి రూ.975 కోట్ల చొప్పున 15 ఏండ్లపాటు సమకూర్చాలని కేంద్రం కోరిందని సీఎం తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంత భారం మోయలేమనీ, ప్రాజెక్టు విధి విధానాలపై చర్చించడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున వర్కింగ్ గ్రూపు కోసం సభ్యులను నామినేట్ చేశామని తెలిపారు. కేంద్రం కూడా చర్చలు ప్రారంభించేలా వెంటనే ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
పెట్రో కాంప్లెక్స్ను ఏర్పాటు చేస్తాం: కేంద్ర మంత్రి
ఏపీలో కచ్చితంగా పెట్రో కాంప్లెక్స్ను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హామీ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. వయబిలిటీ గ్యాప్ ఫండ్ విషయంలోనూ ధర్మేంద్ర ప్రధాన్ సానుకూలత వ్యక్తం చేశారని, వచ్చేవారం ఏపీ చీఫ్ సెక్రెటరీ, పెట్రోలియం శాఖలోని కార్యదర్శులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎంకు కేంద్ర మంత్రి చెప్పినట్టు తెలిపింది. దీనిపై విధి విధానాలను ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి అన్నట్టు పేర్కొంది.
బకాయిలను వెంటనే చెల్లించండి
ఉచిత రేషన్ బియ్యం కింద కేంద్ర ప్రభుత్వం, ఏపీ స్టేట్ సివిల్ సప్ల్కెస్ కార్పొరేషన్కు రూ.3,229 కోట్లు బకాయి పడిందని, వాటిని వెంటనే చెల్లించాలని సీఎం జగన్ కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో రబీ ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతున్నదనీ, రైతులకు సకాలంలో చెల్లింపులు చేయాలంటే.. బకాయిల విడుదల అత్యంత అవసరమని కేంద్ర మంత్రికి తెలిపారు.
బియ్యం పంపిణీ పరిమితితో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం
బియ్యం పంపిణీని పరిమితితో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించారు. శుక్రవారం రైల్ భవన్లో కేంద్ర రైల్వే, వాణిజ్య, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రి పీయుశ్ గోయల్ తో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. కరోనా కారణంగా తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుందని వివరించారు. మరో రెండు నెలల పాటు ఉచితంగా బియ్యం పంపిణీని కేంద్రం పొడిగించినందుకు ధన్యవాదాలు తెలిపారు.