Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన న్యాయస్థానం
న్యూఢిల్లీ : పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు మెహుల్ చోక్సీకి డొమినికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను అక్కడి హైకోర్టు తిరస్కరించింది. ఫ్లైట్ రిస్క్ (తప్పించుకునే అవకాశం ఉందని) కారణాలతో ఆయనకు బెయిల్ ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే మెహుల్ చోక్సీకి డొమినికాతో ఎలాంటి సంబంధాలు లేవని వ్యాఖ్యానించింది. ఈనేపథ్యంలో తాను తప్పించుకోబోనని చోక్సీ కోర్టుకు హామీ ఇచ్చేలా అతనిపై న్యాయస్థానం ఎలాంటి షరతులూ విధించలేదని తెలిపింది. పైగా పిటిషన్లో మెహుల్ చోక్సీ..తన సోదరుడు ఉన్న హోటల్లో ఉంటానని పేర్కొనడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఓ కచ్చితమైన చిరునామా లేని హోటల్లో ఉంటానని ఎలా హామీ ఇవ్వగలడని ప్రశ్నించింది. పిటిషన్లో చోక్సీ ఎలాంటి బలమైన హామీ ఇవ్వలేకపోయాడని తెలిపింది. పైగా ఇంకా కోర్టులో విచారణ కూడా ప్రారంభం కాలేదని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తున్నామని తెలిపింది. చోక్సీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, దేశం విడిచి వెళ్లే అవకాశం లేదని అతని కుటుంబ సభ్యులు తెలిపినప్పటికీ..కోర్టు వారి వాదనను పరిగణలోకి తీసుకోలేదు. వజ్రాల వ్యాపారి, రూ.13,500 కోట్లు విలువజేసే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన మెహుల్ చోక్సీని డొమినికా ప్రధాని రూజ్వెల్ట్ స్కెర్రిట్ భారతీయుడు అని సంబోధించిన విషయం తెలిసిందే. చోక్సీ భవిష్యత్తేంటో కోర్టులే తేలుస్తాయని వ్యాఖ్యానించారు. దాంతో డొమినికా ప్రభుత్వం భారత్కు సహకరించేందుకు సిద్ధమైనట్టు వార్తలు వెలువడ్డాయి. మరోవైపు చోక్సీని భారత్కు పంపించాలన్న పిటిషన్పై విచారణ డొమినికా కోర్టు వాయిదా వేసింది. దాంతో చోక్సీకి ఓ రకంగా తాత్కాలిక ఉపశమనం లభించినట్టయింది.
మే 23న ఆంటిగ్వాలో అదృశ్యమైన చోక్సీ..కొద్ది రోజులకు డొమినికాలో ప్రత్యక్షమయ్యారు. చోక్సీని ఎవరో అపహరించి డొమినికాకు తీసుకొచ్చారని ఆయన తరఫు న్యాయవాది వాదిస్తుండగా, అక్రమంగా ప్రవేశించారని అక్కడి పోలీసులు చెబుతున్నారు. అక్కడి నుంచి మరో దేశానికి పారిపోయే యోచనలో ఉండగానే చోక్సీ పోలీసులకు చిక్కాడు.