Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రిపుర ప్రజలకు సీపీఐ(ఎం) పిలుపు
- రాష్ట్రంలో అరాచకం నెలకొందన్న నేతలు
అగర్తలా : ప్రజాస్వామ్య హక్కులపై, వ్యక్తుల, ఆస్తులను పరిరక్షించుకునే హక్కుపై త్రిపురలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా దాడులు కొనసాగిస్తోంది. కొవిడ్ కారణంగా లాక్డౌన్, కర్ఫ్యూ అమల్లో వున్నా వాటిని లెక్క చేయకుండా బీజేపీ గూండాలు పట్ట పగలే ఈ దాడులకు తెగబడుతున్నారు. మంత్రి సమక్షంలోనే, ఆయన ఆదేశాలతోనే దాడులు జరుగుతున్న సంఘటనలూ వున్నాయి. ఇన్ని ఘటనలు జరిగినా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. మే 12వ తేదీన సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం గవర్నర్ని కలిసి పోలీసులు పోషిస్తున్న పక్షపాత పాత్రను, దిగజారుతున్న శాంతి భద్రతల పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇంకోసారి దాడి జరగకుండా చూస్తానని గవర్నర్, ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. మళ్లీ మే 31న త్రిపుర ఎంపి ఝర్నాదాస్ వైద్య గవర్నర్ని కలిసి 29, 30 తేదీల్లో జరిగిన దాడుల గురించి తెలియచేశారు. ఈ రాజకీయ హింసాకాండను నిలుపుచేసేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని మరోసారి గవర్నర్ హామీ ఇచ్చారు. ఇటువంటి భయానక పరిస్థితులు నెలకొన్న తరుణంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఎంఎల్ఎ భానూలాల్ సాహా మే 30వ తేదీన ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. పెట్రోలు బాంబులు, కర్రలతో బయట నుండి వస్తున్న దుండగులను ఐక్యంగా ప్రతిఘటించాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలను, ఆస్తులను కాపాడుకునేందుకు మీ చేతిలో, దగ్గరలో ఏ వస్తువుంటే వాటితో తిరగబడాల్సిందిగా కోరారు. ఆత్మ రక్షణ కోసం ఇంట్లోని వస్తువులు ఉపయోగించడం నేరమేమీ కాదని అన్నారు. మీ ప్రాణాలు, ఆస్తులు కాపాడుకోవాలంటే ప్రతిఘటన ఒక్కటే మార్గమని అన్నారు. ప్రజలందరూ ఏకతాటిపైకి రావడం ద్వారా పాలక పార్టీ గూండాలను ప్రతిఘటించాలని కోరారు. భానూలాల్ సాహా పోస్ట్కు మద్దతుగా పార్టీ కేంద్ర కమిటీ సభ్యులైన విజన్ధర్, జితేంద్ర చౌదరిలు విడివిడిగా ఫేస్బుక్ పోస్టులు పెట్టారు. సాహా ఇచ్చిన పిలుపుకు మద్దతు తెలుపుతూ విజన్ధర్, ఎంపిక చేసుకున్న సీపీఐ(ఎం) నేతల, కార్యకర్తల ఇళ్ళపై బీజేపీ దుండగులు పిరికితనంగా దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ పోస్ట్కు మద్దతుగా జితేంద చౌదరి మాట్లాడుతూ, ఈ దాడుల్లో బాధితులుగా మారడం కన్నా ధైర్యంతో ఎదురు తిరిగి పోరాడాలని పార్టీ కార్యకర్తలను ఉద్భోధిస్తూ మరో పోస్ట్ పెట్టారు. సీపీఐ(ఎం) నేతలు పెట్టిన పోస్టులపై ప్రస్తుతం త్రిపుర మీడియాలో చర్చ జరుగుతోంది. బిజెపి అధీనంలోని మీడియా విమర్శిస్తుండగా, స్వతంత్ర మీడియా మాత్రం రాష్ట్రంలో నెలకొన్న అరాచకతాన్ని విమర్శిస్తోంది. అందువల్లే ఇలాంటి పోస్టులు అవసరమవుతున్నాయని అన్నారు. ఈ పోస్టుల పట్ల పాలక బిజెపి తీవ్రంగా ప్రతిస్పందించింది. ఎవరైతే పోస్టులు పెట్టారో వారిపై ఎఫ్ఐఆర్లు దాఖలు చేయాల్సిందిగా బిజెపి నేతలను ఆదేశించింది. దాంతో రాష్ట్రంలోని 14 పోలీసు స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దర్యాప్తు నిమిత్తం మూడు పోలీసు స్టేషన్లకు సాహా హాజరయ్యారు. జితేంద్ర చౌదరి, విజన్ ధర్లు కూడా వేర్వేరు తేదీల్లో ఒకే పోలీసు స్టేషన్కు హాజరయ్యారు. ముఖ్యమంత్రితో సహా పలువురు బిజెపి నేతల రెచ్చగొట్టే ప్రసంగాలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటూ ఫేస్బుక్ పోస్టుల్లో పెట్టిన పిలుపును సిపిఎం నేతలు సమర్ధించారు. ఆత్మ రక్షణ అనేది ప్రతి ఒక్కరి అంతర్గత హక్కని అన్నారు. ఇది చట్టంలో కూడా పొందుపరచబడిందని అన్నారు. అయితే ఈ నిబంధనలు దుర్వినియోగం కావడానికి కచ్చితంగా అవకాశం వుంటుందన్నారు. అయినా కూడా త్రిపురలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అట్టడుగు వర్గాల హక్కులను గుర్తించేలా చేయడం అనివార్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు కుప్పకూలిన తరుణంలో, పోలీసు యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తాము ఈ పిలుపును ఇవ్వాల్సి వచ్చిందన్నారు. తొలుత కమ్యూనిస్టులనే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ గూండాలు తర్వాత తమ పరిధిని విస్తరించారు. డాక్టర్లు, పేరా మెడికల్ సిబ్బంది, నర్సులు, మీడియా సిబ్బంది, న్యాయవాదులు, మేథావులు, ఎవరైతే అసమ్మతి వ్యక్తం చేశారో వారందరినీ లక్ష్యంగా చేసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే యావత్ రాష్ట్రం ఉక్కిరిబిక్కిరవుతోంది. ''ఎవరిపైనా దాడి చేయవద్దు, ఒకవేళ మీపై దాడి చేస్తే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి చర్యలు తీసుకోండి'' అని సీపీఐ(ఎం) నేతలు కోరారు. ఈ పోస్టులు పెట్టిన తర్వాత మొత్తంగా పరిస్థితిలో గణనీయంగా మార్పు వచ్చింది. బీజేపీ గూండాల దాడులను గ్రామస్తులు విజయవంతంగా తిప్పికొడుతున్నారు. వారి ధాటికి గూండాలు పలాయనవాదం పాటస్తున్నారు.