Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సేవ్ ఫార్మింగ్, సేవ్ డెమోక్రసీ డే
- రైతుల ఉద్యమానికి ఏడు నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఆందోళనలకు పిలుపు
- 198 రోజూ కొనసాగుతున్న రైతు ఉద్యమం
న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడు నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 26న 'రాజ్ భవన్ల ముట్టడి'కి సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది. ఆ రోజున అన్ని రాష్ట్రాల్లోని గవర్నర్ల నివాసాలైన రాజ్భవన్ల ముందు ధర్నాలు చేపడతామని ప్రకటించింది. నల్ల జెండాలతో ధర్నాలో పాల్గొని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు వినతి పత్రాలను పంపిస్తామని ఎస్కేఎం నాయకుడు ఇంద్రజిత్ సింగ్ తెలిపారు.
'1975 జూన్ 26న దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇప్పుడూ అలాంటి పరిస్థితే నెలకొంది. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ. ఈ జూన్ 26 నాటికి మేం ఉద్యమం చేపట్టి 7 నెలలు పూర్తికావస్తుంది. అందుకే ఆ రోజును సేవ్ ఫార్మింగ్, సేవ్ డెమోక్రసీ (వ్యవసాయాన్ని కాపాడుదాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం) డేగా పాటించాలని నిర్ణయించాం' అని ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. ఆ రోజున అన్ని రాజ్భవన్ల ముందు నల్ల జెండాలతో ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా లక్షలాది మంది రైతులు గతేడాది నవంబరు 26 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించి ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఉద్యమం సుప్రీంకోర్టుకు చేరడంతో సాగుచట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. నూతన చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ అవి ఫలించలేదు. చట్టాల్లో సవరణలు తీసుకొస్తామని కేంద్రం ప్రతిపాదించగా.. చట్టాల్లో కార్పొరేట్ ప్రయోజనాలే ఉన్నాయనీ, రైతులకు నష్టాలు తెచ్చిపెడుతున్నాయనీ, అందుకే ఆ రైతు వ్యతిరేక చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని రైతు నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఉధృతంగా ఉద్యమం
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్నది. ఆందోళనల్లో భాగస్వామ్యం అయ్యేందుకు భారీగా అన్నదాతలు కదులుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు సరిహద్దులకు చేరుకుంటున్నారు. గతకొన్ని రోజులుగా ప్రతిరోజూ భారీగా రైతులు సరిహద్దులకు చేరుకుంటున్నారు. రైతు ఉద్యమం శనివారం నాటికి 198వ రోజుకు చేరింది. సింఘు, టిక్రీ, ఘాజీపూర్, షాజహాన్పూర్, పల్వాల్ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళనల్లో భాగస్వాములవుతున్నారు.