Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అది పౌరుడి ప్రాథమిక హక్కు
- ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
- సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న ముగ్గురికి బెయిల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ విధానాలపై ఎవరైనా అసమ్మతి వ్యక్తం చేస్తే.. బెదిరించడంతో పాటు వారి గళాన్ని నొక్కేందుకు చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిరోధక చట్టం(యూఏపీఏ), దేశద్రోహం చట్టం కింద కేసులు నమోదు చేస్తున్న కేంద్రంలోని మోడీ సర్కార్, పలు బిజెపి పాలిత రాష్ట్రాలకు ఢిల్లీ హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చింది. గతేడాది ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న హింస్మాతక ఘటనకు సంబంధించిన కేసులో అరెస్టైన విద్యార్థి నేతలు ఆసిఫ్ ఇక్బాల్, తన్హా, నటాషా నర్వాల్, దేవాంగణ కలితలకు న్యాయస్థానం మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. విద్యార్థులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద మోపిన అభియోగాలను పోలీసులు నిరూపించలేకపోయారని తెలిపింది. వీరికి ట్రయల్ కోర్టు బెయిల్ను నిరాకరిస్తూ ఇచ్చిన ఆదేశాలను పక్కపెట్టిన జస్టిస్ సిద్ధార్ధ్, మదుల్, అనుప్ జైరాం భంభానీలతో కూడిన ధర్మాసనం తీర్పు సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.ప్రభుత్వ విధానాలపై నిరసనలు తెలపడం అంటే ఉగ్రవాద చర్యల కిందకు రావనీ, అది ఈ దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద వచ్చే చర్యలకు 'ఉగ్రవాద కార్యకలాపాలు' అనే పేరును వినియోగించడం ఆమోదనీయం కాదని పేర్కొంది. 'అసమ్మతిని, ఆందోళనలను అణచివేయాలనే అత్రుతలో ప్రభుత్వాలు ఉన్నట్టు అనిపిస్తోంది. అయితే నిరసన తెలపడం రాజ్యాంగబద్ధమైన హక్కు. ఈ హక్కుకు... ఉగ్రవాద కార్యకలాపాలకు మధ్య ఉన్న తేడాపై ప్రభుత్వానికి అస్పష్టత ఉందనిపిస్తోంది. ఈ అస్పష్టత మరింత పెరిగితే అది ప్రజాస్వామ్యానికి అది విచారకరమైన రోజు అవుతుంది' అని కోర్టు వ్యాఖ్యానించింది.
యూఏపీఏ చట్టంలోని సెక్షన్ 15(ఉగ్రవాద కార్యకలా పాలు), సెక్షన్ 17(ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమీకరించడం), సెక్షన్ 18(ఉగ్ర కుట్ర) ప్రకారం విద్యార్థులు నేరాలకు పాల్పడ్డారనే దానికి పోలీసుల చార్జిషీట్లో ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది. సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో భాగంగా నిందితులు ప్రజలను సమీకరించారని, రహదారులను దిగ్భందించారని కోర్టు స్పష్టం చేసింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేకంగా ముగ్గురు విద్యార్థులు 2019, డిసెంబర్ నుంచి నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలకు, గతేడాది ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు దారితీసిన కుట్రలో భాగం ఉన్నదన్న ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కరోనా రెండు దశల విజృంభణలో కూడా ముగ్గురు విద్యార్థులు ఏడాది పాటు తీహార్ జైల్లో ఉంచారు.
యూఏపీఏ కింద కేసులు నమోదు చేసినందున, మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. కాగా, నటాషా నర్వాల్ తండ్రి మహావీర్ పర్వాల్ కరోనా బారినపడి మరణించగా చివరి కర్మలు చేయడానికి ఆమెకు గత నెలలో మూడు వారాలపాటు మధ్యంతర బెయిల్ లభించింది. ఇక్బాల్ డిగ్రీ పూర్తిచేయడం అత్యవసరమని గుర్తించిన ఢిల్లీ హైకోర్టు అతనికి ఈ నెల మొదట్లోనే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరలా అతనిని జూన్ 26 సాయంత్రం జైలుకి తీసుకురావాలని ఆదేశించింది. దేవాంగన కలిత, నటాషా నర్వాల్ ఇద్దరూ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్యూ)లో పిహెచ్డి స్కాలర్లు కాగా, ఆసిఫ్ ఇక్బాల్ తన్హా జామియా యూనివర్సిటీలో బీఏ మూడో సంవత్సరం విద్యార్థి. కాగా, వీరికి బెయిల్ మంజూరవ్వడంపై సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్భూషణ్ హర్షం వ్యక్తం చేశారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో దాదాపు యాభై మందికిపైగా.. మరణించారు. 200 మంది గాయపడ్డారు.
ఢిల్లీ హైకోర్టు తీర్పును స్వాగతించిన సీపీఐ(ఎం)
ఈశాన్య ఢిల్లీ హింసకు సంబంధించిన యూఏపీఏ కేసులో నిర్బంధంలో ఉన్న ముగ్గురికి బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో మంగళవారం ఒక ప్రకటనలో స్వాగతించింది. రాజ్యాంగ విరుద్ధమైన సీఏఏకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన కార్యకర్తలపై తప్పుడు కేసుల ద్వారా కేంద్ర హోంమంత్రి చేసిన తీవ్ర అన్యాయాన్ని సరిదిద్దే దిశగా ఇది ఒక అడుగు అని పేర్కొంది. తీర్పు సందర్భంగా ఢిల్లీ హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలను పొలిట్బ్యూరో ఈ సందర్భంగా ప్రస్తావించింది. ''అసమ్మతిని అణచివేయాలనే ఆత్రుతలో.. రాజ్యాంగబద్ధమైన నిరసన తెలిపే హక్కు, ఉగ్రవాద కార్యకలాపాల మధ్య ఉన్న తేడాపై ప్రభుత్వానికి కొంతమేర అస్పష్టత ఉన్నట్టు అనిపిస్తోంది. ఇటువంటి మనస్తత్వం మరింత ఎక్కువైతే, అది ప్రజాస్వామ్యానికి విచారకరమైన రోజు అవుతుంది.'' అని హైకోర్టు ప్రధానంగా వ్యాఖ్యానించిందని తెలిపింది. ప్రభుత్వ తీరును కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసిందని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో పేర్కొంది. ఏవిధంగా అసమ్మతి వ్యక్తం చేసినా, దాన్ని దేశ వ్యతిరేకమని పేర్కొంటూ అనేక మందిని బెదిరించారని, పలువురిపై యూఏపీఏ, దేశద్రోహం చట్టం కింద కేసులు నమోదు చేశారని తెలిపింది. ఇటువంటి ఘటనలన్నింటికీ హైకోర్టు తాజా తీర్పు వర్తిస్తుందని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును ప్రశంసించిన సీపీఐ(ఎం), దీన్ని అక్రమంగా పెట్టిన అన్ని తప్పుడు కేసులకు వర్తింపజేయాలనీ, రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేసింది.