Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 రాష్ట్రాల్లో 48 కేసులు
- పెరుగుతున్న డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా రెండో దశ కాస్త తగ్గుముఖంపడుతున్న వేళ... 'డెల్టా ప్లస్' వేరియంట్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్నది. ఇప్పటివరకు ఈ కొత్తరకం వైరస్ 11 రాష్ట్రాలకు వ్యాపించినట్టు జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్సీడీసీ) డైరెక్టర్ సుజిత్ కుమార్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో ఇది వెలుగు చూడగా.. మన దేశంలోని 18 జిల్లాల్లో ఈ రకం కేసులు ప్రస్తుతం 48 ఉన్నాయని ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ తెలిపారు. ఇప్పటివరకు మన దేశంలో 45వేల శాంపిల్స్ను సీక్వెన్సింగ్ చేయగా ప్రస్తుతం 48 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బయటపడినట్టు వివరించారు. మహారాష్ట్రలో అత్యధికంగా 20 డెల్టా ప్లస్ కేసులు ఉండగా.. తమిళనాడులో 9, మధ్యప్రదేశ్ 7, కేరళ 3, పంజాబ్ 2, గుజరాత్ 2, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, జమ్మూ, కర్ణాటక రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున డెల్టా ప్లస్ కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. దేశంలో కరోనా పరిస్థితిపై నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత్లో సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదని హెచ్చరించారు. ఇంకా 75 జిల్లాల్లో 10శాతం కన్నా ఎక్కువ వైరస్ ప్రభావం ఉండగా.. 92 జిల్లాల్లో 5 నుంచి 10 శాతంగా ఉన్నట్టు వివరించారు. మరోవైపు 'డెల్టా ప్లస్' రకాన్ని ఆందోళనకర రకం (వేరియంట్ ఆఫ్ కన్సర్న్)గా పేర్కొంటున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారమే వెల్లడించింది. దీనిలో సంక్రమణ పెరగడం, ఊపరితిత్తుల కణాల్లోని గ్రాహకాలతో గట్టిగా బంధాన్ని ఏర్పరచుకోవడం, మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సకు పెద్దగా లొంగకపోవడం వంటి లక్షణాలున్నట్టు ఇండియన్ సార్స్-కోవ్-2 కన్సార్టియం ఆన్ జీనోమిక్స్ తెలిపింది.