Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నెలలు గడుస్తున్నా కేంద్రం తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనల అమలులో ట్విట్టర్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్యల పరిష్కార అధికారి (గ్రీవెన్స్ ఆఫీసర్) నియామకంపై మీనమేషాలు లెక్కిస్తుండడంపై, ఐటీ నిబంధనలను ఇంకా అమలు చేయలేదని ట్విట్టర్ బదులివ్వడంపై అసహనం వ్యక్తం చేసింది. అయితే, నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా అధికారులను నియమించే ప్రక్రియ కొనసాగుతున్నట్టు ట్విట్టర్ పేర్కొంది. కాగా, నూతన ఐటీ చట్టాన్ని ట్విట్టర్ అమలు చేయట్లేదంటూ అమిత్ ఆచార్య అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం ఢిల్లీ హైకోర్టు విచారించింది. ''ఇంకెన్నాళ్లు సమయం కావాలి?. చట్టాన్ని అమలు చేసే ప్రక్రియ ఇంకెన్నాళ్లు నడుస్తుంది? మా దేశంలో ట్విట్టర్ ఎంత సమయం కావాలంటే అంత సమయం తీసుకుంటుందా? అంతా మీ ఇష్టమేనా? దాన్ని మేం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోం'' అని జస్టిస్ రేఖా పల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సాజన్ పూవయ్య స్పందిస్తూ.. ''ఇప్పటి వరకూ మేం నూతన ఐటీ నిబంధనలు అమలు చేయలేదు. అయితే, ఆ ప్రక్రియ మొదలుపెట్టాం. గ్రీవెన్స్ ఆఫీసర్ నియామకానికి మరో రెండు వారాలు గడువు కావాలి'' అని కోర్టును కోరారు. ఫిర్యాదులు స్వీకరించే అధికారి ధర్మేంద్ర చాతుర్ను నియమించగా.. ఆయన జూన్ 21న రాజీనామా చేశారని, అప్పటి నుంచి భారత్లోనే ఉండే గ్రీవెన్స్ ఆఫీసర్ను ఎందుకు నియమించలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. రాజీనామా చేసిన చాతుర్.. అసలు తాత్కాలిక అధికారి అని ముందే ఎందుకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టును ట్విట్టర్ తప్పుదోవ పట్టించిందన్నారు. కనీసం ఆ తాత్కాలిక అధికారి రాజీనామా చేశాకైనా పూర్తి స్థాయి గ్రీవెన్స్ అధికారిని నియమించాల్సిందని వ్యాఖ్యానించారు.
గ్రీవెన్స్ ఆఫీసర్ను ఎప్పుడు నియమిస్తారో, ఐటీ చట్టాన్ని ఎప్పుడు అమలు చేస్తారో పక్కా సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. అందుకు ఒక్కరోజు గడువు కావాలని న్యాయవాది కోరగా.. గురువారంలోగా ఏ విషయాన్నీ చెప్పాలని ఆదేశించారు. అయితే, అప్పటి వరకూ ట్విట్టర్కు ఎలాంటి రక్షణ కల్పించలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. ట్విట్టర్పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు. సంస్థ భారత్లో పనిచేయాలంటే.. ఇక్కడి నిబంధనలు, చట్టాలకు లోబడే పనిచేయాలని తేల్చి చెప్పారు. అన్ని సంస్థలు ఐటీ చట్టాన్ని అమలు చేసేలా ఫిబ్రవరి 26న మూడు నెలల గడువు ఇచ్చామని, ట్విట్టర్ ఆ గడువు దాటి 41 రోజులు అయిపోయిందని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ట్విట్టర్ కూడా ఈ విషయాన్ని కోర్టు ముందు అంగీకరించింది.