Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణ వాడేస్తున్నది..
- తక్షణమే ఆపేలా చర్యలు తీసుకోండి : మరోసారి ప్రధానికి ఏపీసీఎం జగన్ లేఖ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరోసారి ప్రధానీ మోడీకి లేఖ రాశారు. పదే పదే జలశక్తి శాఖకు, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసినా వివాదాలు పరిష్కారం కావటం లేదని లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణ వాడేస్తున్నదనీ, తక్షణం ఆపేలా చర్యలు చేపట్టాలని కోరారు.
''ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి తెలంగాణ రాష్ట్రం అక్రమంగా నీటిని వాడేయటం వల్ల ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. ప్రాజెక్టుల్లో తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటం వల్ల విలువైన నీటిని వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, నీటి పంపకాల విషయంలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్ లాంటి యంత్రాంగాలు ఉన్నప్పటికీ తెలంగాణ యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తోంది. తక్షణం తెలంగాణ చేస్తున్న నీటి వినియోగాన్ని నిలువరించకపోతే ఏపీ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయి. విభజన చట్టం ప్రకారం హక్కుగా ఏపీకి చెందాల్సిన నీటి వాటా విషయంలో నష్టపోవాల్సి వస్తుంది. సాగునీటికి సంబంధించిన అవసరాలు ఉన్నప్పటికీ తెలంగాణ నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 834 అడుగుల దిగువన నీటిని ఏపీ వినియోగించుకోలేదని తెలిసే తెలంగాణ విద్యుత్ను ఉత్పత్తి చేయటం దారుణం. జూన్ 1 నుంచి 26 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తే అందులో 19 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వాడేశారు. ఉమ్మడి ప్రాజెక్టులపై కేఆర్ఎంబీతో పాటు సీఐఎస్ఎఫ్ రక్షణ కల్పించేలా ఆదేశించాలి'' అని ప్రధానికి రాసిన లేఖలో కోరారు.