Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనాభా నియంత్రణ బిల్లును తీసుకురానున్న ఉత్తరప్రదేశ్
- ఎక్కువ మంది ఉంటే ఎన్నికలు, ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలకు అనర్హులు..
- ఒక వర్గమే టార్గెట్ అంటూ విమర్శలు
లక్నో: దేశంలో అధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్లో (ప్రస్తుతం 20 కోట్ల జనాభా) రానున్న రోజుల్లో రికార్డు స్థాయిలో జనాభా పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో జనాభా నియంత్రణకు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టం రూపొందిస్తోంది. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు అందకుండా ఆంక్షలు ప్రతిపాదించింది. ఇప్పటికే యూపీ జనాభా నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమ బిల్లు-2021ను రాష్ట్ర లా కమిషన్ విడుదల చేసింది. దీనిపై జులై 19 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు.
ఈ ముసాయిదా చట్టం ప్రకారం.. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు. ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి చేకూరదు. ఏ సంక్షేమ పథకమూ వర్తించదు. అంతేకాదు స్థానిక ఎన్నికల్లో పోటీచేసే అర్హత కూడా ఉండదు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారికి ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే.. వారికి భవిష్యత్లో ప్రమోషన్లు ఇవ్వరు. ఇంట్లో ఎంత మంది ఉన్నా నలుగురి కంటే ఎక్కువ మందికి రేషన్ ఇవ్వరు. రేషన్ కార్డులో నలుగురు మాత్రమే ఉండేలా నిబంధనలను మార్చనున్నారు. ఇక ఇద్దరి కంటే తక్కువ మంది పిల్లలున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఇద్దరు సంతానం పాటించే ప్రభుత్వ ఉద్యోగులకు రెండుసార్లు అదనంగా ఇంక్రిమెంట్ ఉంటుంది. ప్లాట్ లేదా ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటే సబ్సిడీ ఇస్తారు. ఒక ఒక్కరే సంతానం ఉంటే మరిన్ని అదనపు ప్రోత్సాహకాలు అందుతాయి. ఒక్క సంతానమే ఉన్న ఉద్యోగులకు నాలుగు అదనపు ఇంక్రిమెంట్లు ఇస్తారు. పిల్లలకు 20 ఏండ్లు వచ్చే వరకు ఉచిత విద్య, వైద్యాన్ని అందజేస్తారు.లా కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఈ బిల్లును సీఎం యోగి ఆదివారం అధికారికంగా విడుదల చేయనున్నారు. దీనిపై జులై 19 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. అందులో ఏవైనా ముఖ్యమైన అంశాలు ఉంటే బిల్లులో మార్పులు చేస్తారు. అనంతరం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదముద్రవేయాలని సర్కార్ భావిస్తోంది. అనంతరం చట్టం అమల్లోకి వస్తుంది. అయితే, రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలోనే ముస్లి జనాభాను దృష్టిలో ఉంచుకుని ఈ ముసాయిదాను రూపొందించారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. హిందూ ఓట్లను ఆకర్షించేందుకే జనాభా నియంత్రణ డ్రామా అంటూ ఆరోపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ అంశంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.