Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం జరిపే నీట్ పరీక్షను సెప్లెంబరు 12న నిర్వహించనున్నారు. తొలుత ఈ పరీక్షను ఆగస్టు 1న నిర్వహిస్తామని ప్రకటించిన కేంద్రం ఆ షెడ్యూల్లో మళ్లీ మార్పులు చేసింది. తాజాగా, సెప్టెంబర్ 12న ఈ పరీక్ష నిర్వహించ నున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ప్రకటించారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి ఈ పరీక్ష నిర్వహి స్తామని పేర్కొన్నారు. ఇందుకోసం దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం సాయంత్రం 5గంటల నుంచి ఎన్టీఏ వెబ్సైట్లో ప్రారంభమ వుతుందని తెలిపారు.భౌతికదూరం నిబంధనల మేరకు ఈ పరీక్ష నిర్వహించే పట్టణాల సంఖ్యను 155 నుంచి 198కి పెంచుతున్నట్టు వెల్లడించారు. అలాగే, గతేడాది 3862గా ఉన్న పరీక్షా కేంద్రాలను కూడా పెంచనున్నట్టు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులందరికీ మాస్క్లు అందజేయడంతో పాటు శానిటైజర్లు అందుబాటులో ఉంచనున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. తొలుత ఆగస్టు 1న నీట్ నిర్వహిస్తామని మార్చిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించిన విషయం తెలిసిందే. హిందీ, ఇంగ్లీష్తో పాటు 11 భాషల్లో పెన్ అండ్ పేపర్ పద్ధతిలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది.