Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ : కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉండ గా కన్వర్ యాత్రకు యూపీ సర్కార్ అనుమతి ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ నెల 25 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. మరోవైపు కరోనా మూడోముప్పు పొంచి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. ఉత్తర్ప్రదేశ్ (యూపీ) ప్రభుత్వం కన్వర్ యాత్రకు అనుమతి ఇవ్వడంపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ క్లిష్ట సమయంలో యాత్రను ఎందుకు అనుమతించారో సమాధానం చెప్పాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ విషయాన్ని కోర్టు స్వయంగా పరిగణనలోకి తీసుకుంది. దీనికి సంబంధించిన తదుపరి విచారణ శుక్రవారం జరగనుంది. ఏటా శ్రావణ మాసంలో పక్షం రోజుల పాటు శివ భక్తులు గంగా నదీ జలాలను సేకరిస్తుంటారు. దీనికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారు. కఠిన ఆంక్షల మధ్య, పరిమిత సంఖ్యలో కన్వర్ యాత్ర జరుగుతుందని మంగళవారం యూపీ ప్రభుత్వం తెలిపింది. యాత్రికులు తమ వెంట ఆర్టీపీసీఆర్ నెగెటివ్ నివేదికను తప్పనిసరిగా తెచ్చుకోవాలని తెలిపింది. ఇదిలా ఉండగా.. మరో రాష్ట్రం ఉత్తరాఖండ్ మాత్రం కాంవడ్ యాత్రను రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది. వైద్య నిపుణుల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.