Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక నేతలు, జేఎన్యూ విద్యార్థులు, అంబేద్కరిస్టులపైనా నిఘా
- 'పెగాసస్' జాబితాలో బయటపడిన మరి కొన్ని నెంబర్లు
- పార్లమెంటరీ ప్యానెల్ ముందుకు నిఘా వ్యవహారం
న్యూఢిల్లీ : రాజకీయ నాయకులు, జర్నలిస్టులే కాదు, ప్రభుత్వ విధానాలను విమర్శించేవారినందరిపైనా 'పెగాసస్' స్పైవేర్ నిఘా కొనసాగింది. ఉమర్ ఖాలీద్తో సహా పలువురు జేఎన్యూ విద్యార్థులు, అంబేద్కర్వాదులు, కార్మిక సంఘాల కార్యకర్తలు, కుల వ్యతిరేక పోరాటవాదులు ప్రజా ఉద్యమాలు నడిపే వారంతా ఈ నిఘా నీడలో ఉన్నారు. లీకైన రికార్డులో వెలుగుచూసిన నెంబర్లలో అంబేద్కర్వాది అశోక్ భారతి, జేఎన్యూ మాజీ విద్యార్థులు ఉమర్ ఖాలిద్, అనిర్బన్ భట్టాచార్య, రైల్వే యూనియన్ నేత శివ గోపాల్ మిశ్రా, ఢిల్లీకి చెందిన కార్మిక హక్కుల కార్యకర్త అంజని కుమార్, బొగ్గు మైనింగ్ వ్యతిరేక కార్యకర్త అలోక్ శుక్లా, ఢిల్లీ వర్శిటీ ప్రొఫెసర్ సరోజ్ గిరి, బస్తర్కి చెందిన శాంతి కార్యకర్త శుభ్రంశు చౌదరి, బీబీసి మాజీ జర్నలిస్టు, కార్మిక సంఘ నేత సందీప్ కుమార్ రారు తదితరులు ఉన్నారు. ఎన్ఎస్ఓ గ్రూపు నుంచి గుర్తు తెలియని క్లయింట్ ఆసక్తి చూపించే వ్యక్తులని ఆ జాబితా చూస్తే అర్థమవుతోంది.
2018 ఏప్రిల్ 2న దళిత గ్రూపులు పిలుపిచ్చిన భారత్ బంద్, దేశవ్యాప్త సమ్మెపై దృష్టి సారించిన కేంద్రం అందులో కీలకంగా ఉన్న వారిపై నిఘా పెట్టినట్లు తాజాగా వెలుగు చూసిన అంశాలను బట్టితెలు స్తోంది. దీనిపై అశోక్ భారతిని వైర్ ప్రశ్నించగా, చట్టాన్ని నీరుగార్చడానికి చేసే ఏ ప్రయత్నాలనైనా తాను వ్యతిరేకిస్తానని, అందుకోసం ఉధృతంగా ప్రచారం చేస్తానని అన్నారు. ఈ నిఘా తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు. 2019లో సరోజ్ గిరి, బెలా భాటియా, అలోక్ శుక్లా, శుభ్రంశు చౌదరిలపై పెగాసస్ నిఘా వున్నట్టు వాట్సాప్ తెలిపింది. కంపెనీ సెక్యూరిటీలో వున్న నిర్దిష్ట లోపం ద్వారా ఈ దాడి జరిగిందని తెలిపింది. లీకైన జాబితాలో వున్న ఈ నెంబర్లలో కొందరిపై 2017 నుంచి 2019 వరకు నిఘా కొనసాగింది. ఆ ఏడాది జులై వరకు మాత్రమే డేటా బేస్లో ఎంట్రీలు ఉన్నాయి.
పార్లమెంటరీ ప్యానెల్ ముందుకు నిఘా వ్యవహారం
దేశంలో సంచలనం సృష్టించిన పెగాసస్ వ్యవహారం పార్లమెంటరీ ప్యానెల్ ముందుకు రానుంది. పెగాసస్ స్పైవేర్ నిఘా నీడలో వివిధ పార్టీల నేతలు, జర్నలిస్టులు, న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు, ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు, జెఎన్యు మాజీ విద్యార్థులు ఉన్నారన్న వార్తల నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీ ఐటి, హోం శాఖలను ఈ నెల 28న ప్రశ్నించనున్నది. ''పౌరుల సమాచార భద్రత, వ్యక్తిగత గోప్యత అంశాలపై చర్చిస్తాం'' అని కాంగ్రెస్ నేత, లోక్సభ ఎంపి శశి థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది.