Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేదంటే ఇంకో ధర్మాసనానికి బదిలీ చేస్తాం : సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదానికి మధ్యవర్తిత్వానికి సహకరిస్తానని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. 2015 నాటి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కృష్ణా జలాలను విద్యుత్తు అవసరాలకు తెలంగాణ వాడుకుంటున్నదనీ, 2021 జూన్ 28న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను అన్యాయమంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. వాదనల ప్రారంభ సమయంలో జస్టిస్ ఎన్వి రమణ ఏపీ ప్రభుత్వ సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేను ఉద్దేశించి... ''నేను రెండు రాష్ట్రాలకు చెందిన వాడినీ. ఈ అంశంపై గతంలో వాదనలకు హాజరయ్యా. పిటిషన్లో న్యాయపరమైన అంశాలపై విచారించాలని భావించడంలేదు. ఈ కేసులో మూడో వ్యక్తి జోక్యం అనవసరం. మధ్య వర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటామంటే ఈ ధర్మాసనం సహకరిస్తుంది. ఒకవేళ న్యాయపరంగా, కేంద్రం జోక్యం కావాలని భావిస్తే కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేస్తాం'' అని తెలిపారు. దీనిపై ప్రభుత్వం అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి సమయం కావాలని దుష్యంత్ దవే అన్నారు. తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది వైద్యనాధన్ వాదనలు వినిపిస్తూ కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో పిటిషన్పై విచారణ అనవసరమని అన్నారు. నోటిఫికేషన్ అప్పుడే అమల్లోకి రాదనీ, అమలులోకి వచ్చేలోగా చాలా నీటిని నష్టపోతామని దుష్యంత్ దవే ధర్మాసనానికి తెలిపారు. నీటి బోర్డులు ఇంకా ఆపరేషనల్ కాలేదనీ, ఈశాన్యంలో ఏం జరుగుతున్నదో చూస్తున్నామని దవే అన్నారు. ఆ తరహా ఘటనలు జరగాలని కోరుకోకూడదనీ, మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని జస్టిస్ ఎన్వి రమణ సూచించారు. మంగళవారానికి విచారణ వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం, వారం రోజులు వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరాయి. ప్రభుత్వాలను సంప్రదించి నిర్ణయానికి రావాలని పేర్కొన్న ధర్మాసనం విచారణ బుధవారానికి వాయిదా వేసింది.