Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన 'ఎడిటర్స్ గిల్డ్'
న్యూఢిల్లీ : పెగాసస్ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని 'ద ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా' సుప్రీంకోర్టును కోరింది. ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ సంస్థ నుంచి పెగాసస్ స్పైవేర్ను భారత ప్రభుత్వం కొనుగోలు చేసిందని, ఆ స్పైవేర్తో దేశంలోని ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, పౌర హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలు...తదితరులపై అక్రమ నిఘాకు పాల్పడిందని 'ద వైర్' పరిశోధనాత్మక వార్తా కథనం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పెగాసస్ కుంభకోణం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా 'ద ఎడిటర్స్ గిల్డ్' సుప్రీంకోర్టును ఆశ్రయించి, సిట్ విచారణ చేపట్టాలని రిట్ పిటిషన్ దాఖలుచేసింది.ఈ రిట్ పిటిషన్లో పేర్కొన్న అంశాలు ఈ విధంగా ఉన్నాయి.''అధికార దుర్వినియోగం,అవినీతి,పాలనలో లోపాలను బయటపెట్టేం దుకు మీడియా ప్రయత్నిస్తుంది.
జర్నలిస్టుల విధుల్లో పభుత్వాలు, ప్రభుత్వ ఏజెన్సీలు కలుగజేసుకుంటే మీడియా స్వేచ్ఛగా పనిచేయలేదు. ఒకవేళ ప్రభుత్వాలు అధికార దుర్వినియోగానికి పాల్పడితే..దాంట్లో వాస్తవాల్ని తెలుసు కునే హక్కు ప్రతి పౌరుడికి ఉంది'' అని పిటిషన్లో ఎడిటర్స్ గిల్డ్ పేర్కొంది.
విచారణకు ఒప్పుకోని మోడీ సర్కార్
పెగాసస్ కుంభోణం పలు దేశాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు, పాలకులపై ఆరోపణలు వెలువడ్డాయి. భారత్లో పార్లమెంట్ సమావేశాలు స్తంభించిపోయాయి. స్వతంత్ర విచారణ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ భారత్లో మాత్రం మోడీ సర్కార్ పెగాసస్పై విచారణకు ససేమిరా అంటోంది.