Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జడ్జిల ఫిర్యాదులను పట్టించుకోరా!
- దర్యాప్తు సంస్థలు, పోలీసుల తీరుపై సుప్రీం అసంతృప్తి
- జడ్జి ఆనంద్ హత్యపై సుమోటో విచారణ
- ట్రిబ్యునల్స్ను మూసేయాలనుకుంటున్నారా?
న్యూఢిల్లీ : న్యాయమూర్తులకు ఎదురౌతున్న బెదిరింపులు, దూషణలతో కూడిన మెసేజ్లపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థపై పెరుగుతున్న ఈ తరహా దాడికి సంబంధించి జడ్జిలు ఇచ్చిన ఫిర్యాదులను సీబీఐ, ఐబీ దర్యాప్తు సంస్థలతోపాటు రాష్ట్ర పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయమూర్తుల రక్షణకు, ప్రత్యేకంగా హైప్రొఫైల్ వ్యక్తుల ప్రమేయం ఉన్న క్రిమినల్ కేసులపై విచారణ చేస్తున్న ట్రయల్ జడ్జిల కోసం ఇక ప్రత్యేక ఫోర్స్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. గతనెల 28న జార్ఖండ్లోని ధన్బాద్లో జిల్లా న్యాయమూర్తి ఉత్తమ్ ఆనంద్ను దుండగులు ఆటోతో ఢకొీట్టి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యాయస్థానాలు, జడ్జిల రక్షణ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు.. శుక్రవారం దీనిపై విచారణ చేపట్టింది. సబార్డినేట్, హైకోర్టుల్లోని న్యాయాధికారులకు కల్పిస్తున్న రక్షణపై ఈనెల 17లోపు నివేదిక సమర్పించాలని ఎన్.వి.రమణ, సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.విచారణ సందర్భంగా ఎన్వి.రమణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ''పని చేయడంలో జడ్జిలకు స్వేచ్ఛ లేకుండా పోయింది. న్యాయవ్యవస్థకు సిబిఐ, ఐబి, పోలీసులు కూడా సహకరించడం లేదు. నేను కొంత బాధ్యతతో ఈ ప్రకటన చేస్తున్నాను'' అని పేర్కొన్నారు. గ్యాంగ్స్టర్లు, హైప్రొఫైల్ వ్యక్తుల ప్రమేయం ఉన్న పలు కేసుల్లో జడ్జిలను బెదిరిస్తున్న ఉదాహరణలు దేశవ్యాప్తంగా చూస్తున్నామని అన్నారు. జడ్జి హత్య కేసు విచారణను సిబిఐకి అప్పగించినట్లు జార్ఖండ్ ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరించగా, ధర్మాసనం మండిపడింది. 'సిబిఐ కేసు విచారణ ప్రారంభించిందని మీరు చేతులు దులుపుకొన్నారా?' అని ప్రశ్నించింది. జడ్జిలకు తగిన రక్షణ కల్పించడంలో జార్ఖండ్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఆనంద్ హత్య జరిగిందనీ, బొగ్గు మాఫియా ప్రభావం అధికంగా ఉండే ధన్బాద్ వంటి జిల్లా జడ్జిగా పనిచేస్తున్న ఆనంద్ వంటి వారికి వస్తున్న బెదిరింపులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని సీజేఐ అన్నారు. జడ్జి హత్యపై విచారణలో భాగంగా సీబీఐ అధికారులు సోమవారం తమ ముందు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది.
ట్రిబ్యునల్స్ను మూసేయాలనుకుంటున్నారా?
ఏండ్ల తరబడి ట్రిబ్యునల్స్లో ఖాళీలను భర్తీ చేయకపోవడంపై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ''ట్రిబ్యునల్స్ను కొనసాగించాలనుకుంటున్నారా లేదా మూసివేసే ఉద్దేశంతో ఉన్నారా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఈ ట్రిబ్యునళ్లకు బ్యూరోక్రసీ అవసరం లేదా?'' అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. ట్రిబ్యునల్స్ నిర్వీర్యమయితే.. ట్రిబ్యునల్స్ అమలు చేసే చట్టపరమైన ప్రాంతాలపై హైకోర్టులకు అధికారం లేని సమయంలో న్యాయం కోసం ఫిర్యాదుదారులు ఎక్కడకు వెళ్లాలని జస్టిస్ సూర్యకాంత్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించారు. '' మీరు ట్రిబ్యునల్స్ అవసరం లేదనుకుంటే.. వారి అధికార పరిధిని హైకోర్టులకు బదిలీ చేసేందుకు అనుమతించండి. లేదా ట్రిబ్యునల్స్ను కొనసాగించాలనుకుంటే ఖాళీలను భర్తీ చేయండి. న్యాయం పొందే ప్రజల హక్కును మీరు నిరాకరించలేరు'' అని స్పష్టంగా చెప్పారు. కీలకమైన ట్రిబ్యునళ్లలో ఉన్న 200 ఖాళీలకు పైగా వివరాలను చీఫ్ జస్టిస్ రమణ చదివి వినిపించారు. ఇది చాలా విచారకరమైన పరిస్థితిని వెల్లడిస్తోందని అన్నారు. 15కు పైగా ట్రిబ్యునళ్లకు ప్రిసైడింగ్ అధికారులు లేరని న్యాయస్థానం తెలిపింది. ఖాళీలను భర్తీకి సంబంధించి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రతిపాదించిన పేర్లను ప్రభుత్వం ఎక్కువ శాతం తిరస్కరించిందని పేర్కొంది. ట్రిబ్యునళ్ల ఖాళీలపై సుప్రీంకోర్టు ఆందోళనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తానని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. కోర్టుల్లో కేసుల కారణంగా నియామకాలు నిలిచివుండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన జస్టిస్ సూర్యకాంత్.. ట్రిబ్యునల్స్లోని సభ్యుల పదవీ కాలానికి సంబంధించి మాత్రమే ఫిర్యాదులున్నాయని, కేసులతో సంబంధం లేని నియామకాలను చేపట్టవచ్చని సూచించారు. జాతీయ, ప్రాంతీయ జిఎస్టి ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాది అమిత్ షాణి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేసిన న్యాయస్థానం కేంద్రంతో పాటు జిఎస్టి కౌన్సిల్కు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ధర్మాసనం ఈనెల 16కు వాయిదా వేసింది.