Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన నేపథ్యంలో ఆ దేశంలో మౌలిక సదుపాయాల పెట్టుబడుల కొనసాగింపుపై ప్రధాని మోడీయే తుది నిర్ణయం తీసుకుంటారని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర విదేశాంగ మంత్రితో చర్చించిన తర్వాత నిర్ణయాలు ఉంటాయన్నారు. ఆ దేశంలో భారత్ చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఇప్పటికే పలు పూర్తి కాగా, ఇంకొన్ని పూర్తి కావాల్సి ఉందని పేర్కొన్నారు. తాలిబన్ నియంత్రిత దేశంలో భారత్ తదుపరి పెట్టుబడులు పెడుతుందా? అని ఇంటర్వ్యూలో భాగంగా ఒక వార్తాసంస్థ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. '' ఆఫ్ఘనిస్తాన్లో నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో మేం పనిచేశాం. సల్దా డ్యామ్ను నిర్మించాం' అని తెలిపారు. '' ఒక స్నేహపూర్వక దేశంగా పలు రహదారులతో నిర్మాణానికి సంబంధించి గతంలో ఆఫ్ఘన్ ప్రభుత్వ అధికారులతో చర్చించాం. ప్రస్తుతం అక్కడ ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి.
ఇప్పటికి రోడ్ల నిర్మాణాలు చేపట్టకపోవడం మంచిది..'' అని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో వివిధ సంక్షేమ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భారత్ ఇప్పటికే దాదాపు 300 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టింది.