Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో విజృంభిస్తున్న వైరల్ జ్వరాలు
- యూపీలో దారుణ పరిస్థితులు.. ఒక్క కాన్పూర్ ఆస్పత్రిలోనే 300 మందికి పైగా రోగులు
- రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం హెచ్చరికలు
న్యూఢిల్లీ: దేశంలో డెంగ్యూ పంజా విసురుతోంది. డెంగ్యూతో పాటు మలేరియా, ఇతర వైరల్ జ్వరాల విజృంభణ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో వైరల్ జ్వరాలు అక్కడి పరిస్థితులను మరింత దారుణంగా మారుస్తున్నాయి. గత నెల నుంచి యూపీలో వైరల్ జ్వరాల తీవ్రత అధికమైంది. ఒక్క కాన్పూర్లోని లాలా లజపతిరారు ఆస్పత్రిలోనే దాదాపు 300 మందికి పైగా చేరడం అక్కడ వైరల్ జ్వరాల వ్యాప్తికి అద్దం పడుతున్నాయి. ఇందులో పెద్దలతో పాటు చిన్నారులు సైతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆస్పత్రి వర్గాల ప్రకారం వైరల్ జ్వరాలతో చేరినవారిలో కొంత మందికి డెంగ్యూతో పాటు మలేరియా కూడా ఉన్నట్టు నిర్ధారణ అయింది. అయితే, ఇప్పటికే వరకు ఈ వ్యాధుల కారణంగా ఎంతమంది చనిపోయారనేది వెల్లడించలేదు. దీనిపై లాలా లజపతిరారు ఆస్పత్రి డాక్టర్ సంజరు కాలా మాట్లాడుతూ.. 'దాదాపు నెల నుంచి 250 మందికి పైగా వైరల్ జ్వరాలతో మా ఆస్పత్రిలో చేరారు. డెంగ్యూతో చేరినవారిలో 25 మందికి పైగా ఉన్నారు. ఇందులో చిన్నారులు కూడా ఉన్నారు. ఇప్పటికే పలువురు కోలుకున్నారు' అని తెలిపారు. ఇక ఫిరోజాబాద్ సైతం వైరల్ జ్వరాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఇక్కడ ఇప్పటివరకు 60 మందికి పైగా మరణించారని అధికారిక లేక్కలు పేర్కొంటున్నాయి. డెంగ్యూతో ఇక్కడ 160 మందికిపైగా మరణించారని దైనిక్భాస్కర్ తాజాగా నివేదించింది. అలాగే, మధుర, ఆగ్రా, బల్లియా, వారణాసి, బస్తీ, ప్రయాగ్రాజ్ జిల్లాల్లోనూ వైరల్ జ్వరాల వ్యాప్తి అధికంగా ఉంది.
రాష్ట్రంలో వైరల్ జ్వరాల వ్యాప్తిని నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని యూపీ ఆరోగ్య మంత్రి జై ప్రతాప్ సింగ్ తెలిపారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం గుర్తించిందనీ, వైరల్ జ్వరాల వ్యాప్తికి అదే ప్రధాన కారణమని తెలిపారు. ఇదిలావుండగా, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రజలు వాపోతున్నారు. పారిశుధ్యాన్ని నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందనీ, ఎక్కడి చెత్త అక్కడే ఉండటంతో పాటు రోడ్లపై, చాలా కాలనీల్లో మురుగు ప్రవహిస్తున్న పట్టించుకోవడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు.
11 రాష్ట్రాల్లో ఆందోళనకర పరిస్థితులు
దేశవ్యాప్తంగా డెంగ్యూ, మలేరియా వంటి ఇతర వైరల్ జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. 11 రాష్ట్రాల్లో డెంగ్యూతో పాటు ఇతర వైరల్ జ్వరాల తీవ్రత ఆందోళనకరంగా ఉందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు. వాటిలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాలు ఇలాంటి కేసులను గుర్తించడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీని కోసం వైరల్ జ్వరాల సమాచారానికి సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్ల ఏర్పాటు, టెస్టింగ్ కిట్లు, దోమల నివారణకు ముందుస్తు చర్యలు, వైద్య, ఇతర సహాయం కోరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వైరల్ జ్వరాలను దృష్టిలో ఉంచుకుని తగినంతగా మందుల నిల్వలు, సరఫరా, బ్లడ్ బ్యాంకుల్లోనూ రక్తం నిల్వలను తగినంతగా నిర్వహించడానికి సంబంధిత యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని తెలిపింది. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు సైతం జారీచేసింది. ఒకవైపు కరోనా మరోవైపు వైరల్ జ్వరాల నేపథ్యంలో రాబోయే పండగా సీజన్ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొంది.