Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ లేదు..
- యూపీ జల్నిగమ్ ముందు ధర్నా
లక్నో: యూపీ జల్నిగమ్లో ఉద్యోగులు పడుతున్న కష్టాలు అన్ని ఇన్నీకావు. గత నాలుగు నెలల నుంచి వారికి జీతాల్లేవ్. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఏడాదిన్నరగా పెన్షన్ లేదు. ఈ విషయం గురించి మేనేజింగ్ డైరెక్టర్తో చర్చలు జరిపినా..ఫలితమివ్వలేదు. పస్తులుండి పనిచేయాలా..అంటూ ఉద్యోగులు ఉన్నతాధికారులను నిలదీస్తున్నారు. యోగి సర్కార్ మాత్రం పట్టించుకోకపోవటంతో సోమవారం నుంచి ఉద్యోగులంతా నిరవధిక సమ్మెకి దిగారు. జల్నిగమ్ కార్యాలయం ముందే బైటాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు.
జల్నిగమ్లో 30 ఏండ్లకు పైగా పనిచేసిన రెగ్యులర్ ఫీల్డ్ ఉద్యోగుల పదవీ విరమణ చేశాక...కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. వైద్యానికి మందుల్లేక అవస్థలు పడుతున్నారు. బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల తమ ప్రాణాలుపోతే..సీఎం యోగి బాధ్యత వహించాల్సి ఉంటుందని రిటైర్డ్ ఉద్యోగులు వాపోతున్నారు.జల్ నిగమ్ జల్సంస్థాన్ మజ్దూర్ యూనియన్ 26 వ వార్షికోత్సవం సంధర్భంగా.. ఉద్యోగులు,వితంతువులు, రిటైర్డ్ ఉద్యోగులు, మరణించిన ఉద్యోగుల కుటుంబీకులు నిరవధిక ధర్నాకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా సత్యాగ్రహదీక్షలు షురూ చేశారు.యూనియన్ వ్యవస్థాపకుడు డాక్టర్ వేద్ ప్రకాష్ శ్రీవాస్తవ విప్లవ గీతంతో దీక్షలు ప్రారంభమయ్యాయి. సర్వోన్నత న్యాయస్థానం ఉద్యోగులందరికీ పెన్షనరీ ప్రయోజనాలు ఇవ్వాలని ఆదేశిస్తే... యోగి సర్కార్ మాత్రం బేఖాతరు చేస్తున్నదని యూనియన్ ప్రెసిడెంట్ రామ్ సేనేహి యాదవ్ తెలిపారు. జల్నిగమ్ ఉద్యోగులకు రావాల్సిన జీతం విషయంలో ఎన్నోసార్లు ఆందోళనలు చేశామని వివరించారు.
జీతం చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రతిసారీ మొండిచేయి చూపిస్తున్నదని ఆయన ఆరోపించారు.ఏప్రిల్ జీతం ఇచ్చారు. కానీ మే నుంచి సెప్టెంబర్ వరకు పెండింగ్లో ఉన్న జీతాలు, పెన్షన్లు ఇవ్వలేదని తెలిపారు.జల్నిగమ్ పరిధిలోని తాగునీటి పథకాలు,మురుగునీటి శుద్ధి కర్మాగారాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను జీతాలివ్వకుండా ఇబ్బందిపెట్టడం యోగిసర్కార్కు తగదని యూనియన్ జనరల్ సెక్రెటరీ సతీశ్ కుమార్ శర్మ హెచ్చరించారు.