Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం నుంచి నేరుగా ఏజెన్సీలకు బదిలీ
- 2015 నుంచి 350 శాతం పెరుగుదల : కాగ్
న్యూఢిల్లీ : మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లోని ఏజెన్సీలకు కేంద్రం అధికంగా నిధులు కేటాయిస్తున్నది. గత ఆరేండ్లలో నుంచి వేలకోట్ల రూపాయలు వీటికి అందాయి. 2015 నుంచి ఈ నిధుల కేటాయింపులు 350 శాతం పెరగడం గమనార్హం. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆఫ్ ఇండియా రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వర్షకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా 'స్టేట్ ఫైనాన్స్ ఆడిట్ రిపోర్ట్ ఆఫ్ ది కాగ్'ను ప్రవేశపెట్టారు. కేంద్రం నుంచి నేరుగా నిధులు బదిలీ అయ్యాయని కాగ్ గుర్తించింది.
కాగ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. రాష్ట్రం పొందిన నిధులు, వ్యయం, ఇతర ఆర్థిక అంశాలపై ఇందులో పూర్తి పిక్చర్ లేదు. 2015-16లో గుజరాత్కు రూ. 2,542 కోట్ల నిధులు అందాయి. అయితే, 2019-20 నాటికి అది 350 శాతం పెరిగి రూ. 11,659 కోట్లకు చేరడం గమనార్హం. 2019-20లో ప్రయివేటు సెక్టార్ కంపెనీలకు కేంద్రం నుంచి నేరుగా రూ. 837 కోట్లు అందాయి. ఇదే సమయంలో, ప్రయివేటు విద్యాసంస్థలకు రూ. 17 కోట్లు, ట్రస్టులకు రూ. 79 కోట్ల మేర చేరాయి. రిజిస్టర్ సొసైటీలు, ఎన్జీవోలకు కేంద్రం నుంచి రూ. 18.35 కోట్లు, కొందరు వ్యక్తులకు రూ. 1.56 కోట్లు నేరుగా కేంద్రం నుంచే అందాయి. అయితే, ఈ నిధుల బదిలీలు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ద్వారా జరగకపోవడం గమనించాల్సిన అంశం. ఇక కేంద్ర, కేంద్ర-రాష్ట్ర పథకాల అమలు కోసం 2019-20లో కేంద్రం నుంచి గుజరాత్కు భారీగానే నిధులు సమకూరాయి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (రూ. 3,133 కోట్లు), గాంధీనగర్, అహ్మదాబాద్ కోసం ది మెట్రో-లింగ్ ఎక్స్ప్రెస్ (రూ. 1,667కోట్లు), ఉపాధి హామీ పథకం (రూ. 593 కోట్లు), ఎంపీల్యాడ్స్ (రూ.య 182 కోట్లు), ప్రధాన మంత్రి మాతృ వందన యోజన ( రూ. 97కోట్లు) వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. '' గుజరాత్లో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు (రూ. 3,406 కోట్లు), రాష్ట్ర ప్రభుత్వ పీఎస్యూ లు (రూ. 3,389 కోట్లు), కేంద్ర ప్రభుత్వ సంస్థలు( రూ. 1,826 కోట్లు), ప్రభుత్వ, అటానమస్ రిజిస్టర్డ్ సొసైటీలు ( రూ. 1,069 కోట్లు) కేంద్రం నుంచి నేరుగా భారీ మొత్తంలో నిధులు పొందిన ఏజెన్సీలలో ఉన్నాయి '' అని ఓ వార్త సంస్థ తన నివేదికలో పేర్కొన్నది. అయితే, గుజరాత్ సంస్థలకు నిధుల కేటాయింపు విషయంలో తప్పు లేనప్పటికీ.. ఫెడరల్ స్ఫూర్తి భావనను మోడీ ప్రభుత్వం విస్మరిస్తున్నట్టుగా కనిపిస్తున్నదని విశ్లేషకులు తెలిపారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 'నిధుల కేటాయింపుల అసమానతలు' అధికమయ్యాయని ఆరోపించారు.
ఈ విషయంలో మోడీ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి రాష్ట్రాలకు రావాల్సిన నిధులను కేటాయించాలని సూచించారు.