Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖ : విశాఖ నగరంలో ఆదివారం ఉదయం 7.15 గంటల సమయంలో కొద్ది సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో, ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 9.5 కిలోమీటర్ల మేర ప్రకంపనలు ఏర్పడ్డాయని, ఇది రికార్డు అని అధికారులు పేర్కొన్నారు. పాత నగరం, అల్లిపురం, సీతమ్మధార, నార్త్ ఎక్స్ టెన్షన్, హెచ్బి కాలనీ, గురుద్వారా, సీతమ్మపేట, అక్కయ్యపాలెం, తాటిచెట్లపాలెం, రైల్వే న్యూ కాలనీ, జ్ఞానాపురం, బంగారుమెట్ట, మధురానగర్, సింహాచలం, అడవివరం, గోపాలపట్నం, శ్రీహరిపురం, మల్కాపురం, గాజువాక తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. అల్లిపురంలో ఒక పాత ఇల్లు కూలిపోయింది. ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిది. కొన్నిచోట్ల ఇళ్ల పెంకులు, శాంతిపురం ఎన్జిఒ కాలనీలోని ఒక భవనం స్లాబ్ పెచ్చులు ఊడి పడ్డాయి. ఎవరికీ ఎటువంటి ప్రమాదమూ జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. భూ ప్రకంపనల తీవ్రత రెక్టర్ స్కేలుపై 1.5గా నమోదైందని, ఇది ప్రమాదం కాదని, ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున పేర్కొన్నారు.