Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్వేష ప్రసంగాలు తీవ్రమైన నేరం : సుప్రీం మాజీ న్యాయమూర్తి రోహింటన్ పాలీ నారీమన్
- ప్రధాని మోడీ వ్యాఖ్యలూ అలాగే ఉన్నాయి..
న్యూఢిల్లీ : ఒక మతానికి చెందినవారిని లక్ష్యంగా చేసుకొని విద్వేష ప్రసంగాలు చేయటం..రాజ్యాంగ విరుద్ధమేకాదు, తీవ్రమైన నేరమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రోహింటన్ పాలీ నారీమన్ అన్నారు. చట్టాల్ని సవరించి విద్వేష ప్రసంగాలు చేసేవారికి కనీస శిక్ష పడేట్టు చూడాలని పాలకులకు ఆయన సూచించారు. దేశంలో విద్వేష ప్రసంగాలపై ప్రధాని మోడీ మౌనం వహించటాన్ని ఆయన తప్పుబట్టారు. ఔరంగజేబు, శివాజీలను మతపరమైన కోణంలో ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ ఇటీవల వ్యాఖ్యలపై జస్టిస్ నారీమన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముంబయిలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నారీమన్ పై వ్యాఖ్యలు చేశారు.
ప్రజల్లో సోదరభావం పెంచే ఉద్దేశం ఉంటే..మొఘల్ పాలకుల్లో బాబర్, అక్బర్ గురించి ప్రధాని చెప్పేవారంటూ చురకలు అంటించారు. అలాగే హిందూత్వ సంస్థల విద్వేష ప్రసంగాలపై అధికార బీజేపీ మౌనంగా ఉండటం, ప్రధాని మోడీ సైతం వాటిని ఖండించకపోవటాన్ని నారీమన్ తప్పుబట్టారు. ''విద్వేష ప్రసంగాలు చేయటం చట్టవ్యతిరేకమే కాదు..తీవ్రమైన నేరపూరిత చర్య. ఐపీసీ సెక్షన్ 505(సి), 153ఎ కింద దోషులకు మూడేండ్లపాటు జైలు శిక్ష పడుతుంది. దోషులకు కచ్చితంగా కనీస శిక్ష విధించాలని పాలకులు భావిస్తే..చట్టానికి సవరణ చేయాలి. అప్పుడే విద్వేష ప్రసంగాలు ఆగుతాయి'' అని నారీమన్ అభిప్రాయపడ్డారు.
ప్రధాని మోడీ ఏమన్నారు?
గత ఏడాది డిసెంబర్ 13న వారణాసిలో 'కాశీ విశ్వనాథ్ కారిడార్' ప్రాజెక్ట్ను ప్రారంభిస్తూ ప్రధాని మోడీ ప్రసంగించారు. ''వారణాసి నగరంపై ఎంతో మంది ముస్లిం పాలకులు దాడి చేశారు. ఔరంగజేబు దారుణాలకు చరిత్రలో ఎన్నో ఉదంతాలున్నాయి. సనా తన హిందూ నాగరికతను, సంస్కృతిని తన కత్తితో తుడిచివేయాలని చూశాడు. ఔరంగజేబ్ పుట్టిన ఈ నేలలోనే.. శివాజీ జన్మించాడు'' అంటూ చరిత్రను తన దైన మతపరమైన కోణంలో ప్రధాని మోడీ విశ్లేషిం చారు. ఆయనవ్యాఖ్యల్ని జస్టిస్ నారీమన్ తప్పుబట్టారు.