Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేషనల్ వార్ మెమోరియల్ వద్ద గల జ్వాలలో విలీనం
- దేశరాజధానిలో సైనిక లాంఛనాలతో కార్యక్రమం పూర్తి
- కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన మాజీ సైనికులు, రాజకీయ నాయకులు
న్యూఢిల్లీ : దేశరాజధాని న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద 50 ఏండ్లుగా వెలుగుతున్న అమర జవాన్ జ్యోతి ఇక అక్కడ కనిపించదు. దీనిని దాదాపు 400 మీటర్ల దూరంలో ఉండే నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ఉన్న జ్యోతిలో విలీనం చేశారు. సైనిక లాంఛనాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 1971, జనవరి 26న అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ అమర్ జవాన్ జ్యోతిని ఆవిష్కరించారు. 1971 ఇండియా-పాకిస్థాన్ యుద్ధంలో (ఈ యుద్ధంలో భారత్ గెలవడంతో అది బంగ్లాదేశ్ ఏర్పాటుకు దారి తీసింది) అమరులైన భారత సైనికులకు గుర్తుగా దీనిని నిర్మించారు. అప్పటి నుంచి నిర్విరామంగా ఈ జ్యోతి వెలుగుతోంది. మరోపక్క, నేషనల్ వార్ మెమోరియల్ను 2019, ఫిబ్రవరి 25న ప్రధాని మోడీ ఆవిష్కరించారు. దీనిపై 25,942 మంది పేర్లు లిఖించబడి ఉన్నాయి. అయితే, చారిత్రక నేపథ్యమున్న అమర జవాన్ జ్యోతి విలీనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఎక్స్-సర్వీస్మెన్, ప్రతిపక్ష నాయకులతో పాటు పలువురు ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇండియా గేట్ వద్ద ఉన్న జ్యోతికి సెల్యూట్ చేస్తూ మీరు, నేను, మన సాహస జవాలనులమంతా పెరిగామని మాజీ ఏయిర్ వైస్ మార్షల్ మన్మోహన్ బహదూర్.. పీఎం మోడీకి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. మన వీర జవానుల అమర జ్యోతి ఆరిపోతుండటం చాలా బాధకరమైన విషయమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. కొందరు దేశభక్తిని, త్యాగాన్ని అర్థం చేసుకోలేరని వివరించారు. మన సైనికుల కోసం మళ్లీ ఒకసారి 'అమర జవాన్ జ్యోతి'ని వెలిగిస్తామని పేర్కొన్నారు.కాగా, మాజీ లెఫ్టినెంట్ జనరల్ సతీశ్ దువా, ఆర్మీ స్టాఫ్ మాజీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ జేబీఎస్ యాదవతో పాటు పలువురు కేంద్రం నిర్ణయాన్ని సమర్థించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.