Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదాని,అంబానీల మధ్య సంపదలో పోటాపోటీ
- రిలయన్స్ను దాటుతున్న అదాని గ్రూప్స్
పేదలకు ఉపాధి లేక పస్తులు..గుజరాతీయులపైనే మోడీ మెహర్బానీ. రెండేండ్లుగా దేశ ప్రజల్లో ఎక్కువమంది ఉపాధిలేదు. ఉద్యోగమూ లేదు. కరోనా దెబ్బకు దేశమంతా అల్లకల్లోలమైనా...ఇక్కడి కార్పొరేట్లకు ఎలాంటి దిగుల్లేదు. ఎందుకంటే మోడీ ప్రభుత్వం అండతో..గుజరాతీ సంపన్నులు వేల, లక్షల కోట్లకు పడగలెత్తుతున్నారు. ఫోర్బ్స్మొదలుకుని ఇతర సంస్థలు ప్రకటించే ధనికుల జాబితాల్లో వారిద్దరి పేర్లు టాప్లో కనిపిస్తున్నాయి. అయితే వారి సంపద మధ్య ఎంత గ్యాప్ ఉన్నదంటే...!
ముంబయి: దేశంలోనే అత్యంత ధనిక వ్యాపారవేత్తలైన ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ ఆస్తుల విషయంలో మరోసారి దగ్గరయ్యారు. ఇద్దరి మధ్య వ్యత్యాసం కేవలం రూ.35 వేల కోట్లు మాత్రమే. దీంతో పాటు ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిన రికార్డు అదానీ పేరిట నమోదుకావటం విశేషం.
మార్కెట్ల పతనంలోనూ..
భారత స్టాక్ మార్కెట్లలో గత నాలుగు రోజులుగా తీవ్ర క్షీణత కొనసాగుతోంది. తాజా లెక్కల ప్రకారం గురువారం నాటికి ముకేశ్ అంబానీ ఆస్తులు రూ.7.01 లక్షల కోట్లు. కాగా గౌతమ్ అదానీ ఆస్తులు రూ.6.66 లక్షల కోట్లు. ఈ విధంగా ఇద్దరి మధ్య కేవలం 35 వేల కోట్లు మాత్రమే తేడా ఉన్నది.
రిలయన్స్ గ్రూప్ అధినేతగా ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ యజమానిగా గౌతమ్ అదాని కొనసాగుతున్నారు. అంతకుముందు 2021 నవంబర్ నెలలో వారి సంపద విషయంలో టై అయింది. అప్పట్లో ఇద్దరి ఆస్తులు రూ.6.63-6.63 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అప్పుడు రిలయన్స్ ఇండిస్టీస్ మార్కెట్ క్యాప్ రూ.14.91 లక్షల కోట్లు కాగా, అదానీ గ్రూప్ వాల్యుయేషన్ రూ.10 లక్షల కోట్లుగా ఉంది. ప్రస్తుతం రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.16.77 లక్షల కోట్లు, అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ రూ.11.16 లక్షల కోట్లుగా ఉంది. అదానీకి చెందిన మొత్తం ఆరు కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. తొలిసారిగా తమ మార్కెట్ క్యాప్ రూ.11.10 లక్షల కోట్లు దాటింది. ఇందులో అతిపెద్దది అదానీ గ్రీన్ ఎనర్జీ రూ. 3 లక్షల కోట్ల విలువైన కంపెనీగా ఉంది.
ఆ కంపెనీల విలువ రూ.2 లక్షల కోట్లకు పైనే..
అదానీ ట్రాన్స్మిషన్ రూ.2.21 లక్షల కోట్లు, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్ ఒక్కొక్కటి రూ.2 లక్షల కోట్లకు పైబడిన కంపెనీలు. రిలయన్స్ ఇండిస్టీస్లో ముకేశ్ అంబానీకి 50.61 శాతం వాటా ఉండగా, అదానీకి అతని కంపెనీలలో 70.59 శాతం వాటా ఉన్నది. అదానీకి చెందిన 3 కంపెనీలలో అతని వాటా 74.92 శాతం, ఒక కంపెనీలో ఇది 74.80 శాతం. మరో రెండు కంపెనీల్లో ఇది 60-64 శాతం చొప్పున ఉన్నది.
మెరుగైన అదానీ ర్యాంకింగ్
గత శుక్రవారం (జనవరి 14న) గౌతమ్ అదానీ ర్యాంకింగ్ మెరుగుపడింది. దాని ప్రకారం.. ప్రపంచంలోనే 13వ అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా అదాని ఎదిగాడు. అంతకు ముందు అతను 14వ స్థానంలో ఉన్నాడు. ప్రపంచ సంపన్నుల టాప్ 10 జాబితాలో భారతీయులెవరూ లేరు. ముకేశ్ అంబానీ 11వ స్థానంలో ఉండగా, అదానీ 12వ స్థానంలో ఉన్నారు. డాలర్ పరంగా, రెండింటి మధ్య వ్యత్యాసం దాదాపు ఐదు బిలియన్ డాలర్లు (రూ.37,500 కోట్లు), ఇది జనవరి 14 నాటికి 9.5 బిలియన్ డాలర్లు (రూ.71,250 కోట్లు) చేరింది. ఇటీవలి కాలంలో గౌతమ్ అదానీ కంపెనీల షేర్ల ధరలు భారీగా పెరిగాయి.
పెరిగిన అంబానీ ఆస్తులు..
బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ డేటా ప్రకారం.. ఈ ఏడాదిలో ముకేశ్ అంబానీ సంపద రూ.31,592 కోట్లు పెరిగితే, అదానీ సంపద రూ.96,863 కోట్లు హెచ్చింది. ఇటీవల అంబాని, అదానిలు గుజరాత్లో భారీ పెట్టుబడులు పెట్టారు. గుజరాత్లో గ్రీన్ ఎనర్జీ , ఇతర ప్రాజెక్టులపై వచ్చే 10-15 ఏండ్లలో ముకేశ్ అంబానీ రూ.5.95 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. ఇందులో జియో, రిటైల్ సహా ఇతర విభాగాలపై దృష్టి సారిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసేందుకు దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీతో అదానీ గ్రూప్ రూ.40,000 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది.
టాప్ 12లో భారతీయుల అత్యధిక సంపాదన
ఇప్పటివరకు ఆదాయాల పరంగా చూస్తే.. ప్రపంచంలోని టాప్ 12 మంది సంపన్నులలో అదానీ, అంబానీ మాత్రమే ముందున్నారు. అత్యంత సంపన్నమైన టెస్లా యజమాని ఎలోన్ మస్క్ సంపద 14.4 బిలియన్లు తగ్గగా, జెఫ్ బెజోస్ సంపద 15.5 బిలియన్ డాలర్లు క్షీణించింది. టాప్ 12లో అదాని, అంబానీని మినహాయిస్తే, వారెన్ బఫెట్ సంపద మాత్రమే పెరిగింది. అతను 3.89 బిలియన్ డాలర్ల (రూ.74వేల కోట్లు) సంపాదించాడు. కాగా.. టాప్ 100 మంది సంపన్నులలో అత్యధికంగా సంపాదిస్తున్న జాబితాలో అదానీ ఉన్నారు.