Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల రాజకీయాల్లో ఫేస్బుక్ జోక్యం : సోనియాగాంధీ
- ఓ పద్ధతి ప్రకారం ప్రభావితం చేస్తోంది..
- ఫేస్బుక్లో బీజేపీకి తక్కువ రేట్లకు ప్రచార ప్రకటనలు : రాహుల్గాంధీ
న్యూఢిల్లీ : రాజకీయ అభిప్రాయాలను రూపొందించటం కోసం పార్టీలు, నాయకులు, వారి ప్రతినిధులు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవటంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి ప్రపంచస్థాయి టెక్ కంపెనీలను వీరు వాడుకుంటున్నారని, రాజకీయ వైఖరులను నిర్ణయించేందుకు ఈ సామాజిక మాధ్యమాల వేదికలతో అధికార పక్షం సహవాసం చేస్తున్నట్టు కనిపిస్తోందని ఆరోపించారు. ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి, ప్రజాస్వామిక నిర్మాణానికి ఉపయోగపడబోవని స్పష్టం చేశారు.
లోక్సభలో బుధవారం జీరో అవర్లో సోనియాగాంధీ మాట్లాడుతూ..''ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశ ఎన్నికల రాజకీయాల్లో ఫేస్బుక్, తదితర సోషల్మీడియా జోక్యం చేసుకోవడానికి, పద్ధతి ప్రకారం ప్రభావితం చేస్తుండటానికి ముగింపు పలకాలని ప్రభుత్వాన్ని కోరారు. అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ దేశ ప్రజాస్వామ్యం, సాంఘిక సామరస్యాలను కాపాడాలని నొక్కివక్కాణించారు. గ్లోబల్ సోషల్ మీడియా కంపెనీలు అన్ని పార్టీలకు సమాన అవకాశాలు గల రణక్షేత్రాన్ని అందించడం లేదని తరుచూ బహిరంగంగా వెల్లడవుతోందన్నారు. భావోద్వేగాలను రెచ్చగొట్టే సమాచారం అని తెలిసినప్పటికీ, ఈ కంపెనీలు వాటి నుంచి లాభాలు ఆర్జిస్తున్నాయని ఆరోపించారు.
ఈ సందర్భంగా విదేశీ మీడియాలో వచ్చిన కథనాలను సోనియాగాంధీ ప్రస్తావించారు. ఫేస్బుక్ మిగతా పార్టీలకన్నా బీజేపీకి ఎన్నికల ప్రచార ప్రకటనల రేట్లను తగ్గించిందని విదేశీ మీడియా వెల్లడించిందన్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ కూడా బుధవారం ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి ఫేస్బుక్ అవాంఛనీయమని అన్నారు. ''మెటా-ప్రజాస్వామ్యానికి అవాంఛనీయం'' అని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఓటర్లకు బీజేపీ చేరువయ్యేందుకు ఫేస్బుక్ సహాయపడినట్టు విదేశీ మీడియా రాసిన కథనాలను ఈ ట్వీట్కు జతచేశారు. ఫేస్బుక్ మిగతా పార్టీల కన్నా బీజేపీ ఎన్నికల ప్రచార ప్రకటనల రేట్లను తగ్గించిందని విదేశీ మీడియా వెల్లడించిందని తెలిపారు.