Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోని వివిధ కోర్టుల్లో 4,07,12,190 కేసులు పెండింగులో ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. లోక్సభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022 మార్చి 2 వరకు సుప్రీం కోర్టులో 70,154 కేసులు పెండింగులో ఉన్నాయని పేర్కొన్నారు. 2022 మార్చి 21 నాటికి హైకోర్టుల్లో 58,94,060 కేసులు, జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 4,10,47,976 కేసులు పెండింగులో ఉన్నాయని తెలిపారు. 2022 మార్చి 14 నాటికి సుప్రీం కోర్టులో రెండు, 23 హైకోర్టుల్లో 405 న్యాయమూర్తుల ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎపి హైకోర్టులో 11, తెలంగాణ హైకోర్టులో 23 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. దేశంలో జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 5,180 జడ్జిల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఎపిలో 120, తెలంగాణలో 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఇండియన్ ఆర్మీలో ఉమెన్ వింగ్ లేదు
ఇండియన్ ఆర్మీలో ప్రత్యేక ఉమెన్ వింగ్ లేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో 10 వేర్వేరు ఆర్మీ, సేవల్లో మహిళా అధికారులు నియమితులయ్యారని, వంద మంది మహిళా సైనికులు కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్లో నమోదు చేసుకున్నారని తెలిపారు.
డేటా లేదు
ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే భారతీయుల డేటా తమ వద్ద లేదని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. 'విదేశాలకు వెళ్లే భారతీయ పౌరుల డేటాను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించదు. ప్రపంచ వ్యాప్తంగా 13 మిలియన్లకు పైగా భారతీయలు ఉన్నట్లు అంచనా. తద్వారా భారతదేశం అతిపెద్ద వలసలు వెళ్లే దేశంగా నిలిచింది' అని ఒక ప్రశ్నలకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లేందుకు వీసా తీసుకున్నవారు 2020లో 70,26,960 మంది కాగా, 2021లో 82,48,870 మంది అని పేర్కొన్నారు.