Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టుకు తెలిపిన యూపీ ప్రభుత్వం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రా బెయిల్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం తమ స్పందనను కోర్టుకు అందజేసింది. ఆశిష్కు బెయిల్ ఇవ్వడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకించామని యూపీ ప్రభుత్వం వెల్లడించింది. అంతేగాక ఈ కేసులో సాక్షులకు తగిన భద్రత కల్పిస్తున్నట్టు తెలిపింది. ''అలహాబాద్ హైకోర్టులో ఆశిష్ మిశ్రా బెయిల్ను యూపీ ప్రభుత్వం వ్యతిరేకించలేదంటూ లఖింపూర్ బాధిత కుటుంబాలు చేస్తోన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. అతడి బెయిల్ దరఖాస్తును మేం తీవ్రంగా వ్యతిరేకించాం. బెయిల్కు వ్యతిరేకంగా అప్పీల్ దాఖలు చేసే అంశాన్ని సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు'' అని యూపీ ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు లఖింపూర్ ఖేరి ఘటనలో ఫిబ్రవరి 10న అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ను వ్యతిరేకిస్తూ బాధిత కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అంతేగాక ఈ కేసులో సాక్షలను బెదిరిస్తున్నారంటూ ఆరోపించాయి. దీనిపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం..ఈ పిటిషన్పై స్పందన తెలియజేయాలంటూ యూపీ సర్కార్కు నోటీసులు జారీచేసింది. ఈనేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం కోర్టుకు స్పందన తెలియజేసింది. ఆశిశ్ బెయిల్పై సుప్రీంకోర్టు నేడు మరోసారి విచారణ జరపనున్నది.
ఈ సందర్భంగా లఖింపూర్ ఘటనలో సాక్ష్యులపై దాడి జరిగినట్టు వస్తోన్న వార్తలను కూడా యూపీ ప్రభుత్వం ఖండించింది. ''తమపై దాడి జరిగినట్టు లఖింపూర్ ఘటన సాక్షులు చెప్పలేదు. ఈ ఘటనలో బాధితులు, సాక్షుల కుటుంబాలకు నిరంతరం భద్రత కల్పిస్తున్నాం. సాయుధ సిబ్బందితో సాక్షులకు రక్షణ కల్పిస్తున్నా''మని ప్రభుత్వం వెల్లడించింది.