Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో గత ఏడాది డిసెంబరులో జరిగిన ధర్మ సంసద్లో విద్వేష ప్రసంగాల కేసులో పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్పై అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తంచేసింది. ఓఖ్లా పోలీస్ స్టేషన్ అధికారి సమర్పించిన దర్యాప్తు నివేదికను ఎవరైనా ఉన్నతాధికారి తనిఖీ చేశారా? అని ప్రశ్నించింది. న్యాయస్థానం సమక్షంలో దాఖలు చేసే అఫిడవిట్లో ఇటువంటి వైఖరిని ప్రదర్శించవచ్చునా? అనే విషయాన్ని ఉన్నతాధికారులెవరైనా సరి చూశారా? అని అడిగింది.
హిందూ యువ వాహిని గత ఏడాది హరిద్వార్, ఢిల్లీలలో నిర్వహించిన ధర్మ సంసద్ కార్యక్రమాల్లో కొందరు విద్వేషపూరితంగా ప్రసంగించారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది. జస్టిస్ ఎఎం ఖన్విల్కర్, జస్టిస్ అభరు ఎస్ ఓకా ధర్మాసనం పోలీసులు సమర్పించిన అఫిడవిట్ను పరిశీలించింది. ఓఖ్లా పోలీస్ స్టేషన్ అధికారి దర్యాప్తు చేసి, సమర్పించిన నివేదికను ఉన్నతాధికారులెవరైనా తనిఖీ చేశారా? అని జస్టిస్ ఖన్విల్కర్ ప్రశ్నించారు. న్యాయస్థానం సమక్షంలో దాఖలు చేసే అఫిడవిట్లో ఇటువంటి వైఖరిని ప్రదర్శించవచ్చునా? అనే విషయాన్ని ఉన్నతాధికారులెవరైనా సరి చూశారా? అని అడిగారు. దీనిని ఢిల్లీ పోలీసు శాఖలోని డిప్యూటీ పోలీస్ కమిషనరే దాఖలు చేశారా? అని ప్రశ్నించారు. దర్యాప్తు నివేదికను తిరిగి రాశారా? అని ప్రశ్నించారు. ఆయన సూక్ష్మమైన అంశాలను అర్థం చేసుకోగలరని భావిస్తున్నామన్నారు.
ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేయడంతో అదనపు సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్ స్పందిస్తూ, పోలీసు శాఖ దీనిని పరిశీలిస్తుందనీ, తాజాగా మరొక అఫిడవిట్ను దాఖలు చేస్తామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ధర్మ సంసద్లో విద్వేష ప్రసంగంపై సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసుకు ఢిల్లీ పోలీసులు ఇచ్చిన సమాధానంలో ఈ కార్యక్రమంలో ఎటువంటి విద్వేషాన్ని వ్యక్తం చేయలేదని తెలిపారు. ఏదైనా మతపరమైన లేదా విశ్వాసపరమైన సమూహం, సముదాయం, భౌగోళిక స్థానికులపై ఎటువంటి విద్వేషాన్ని వ్యక్తం చేయలేదని తెలిపారు. ఉనికిని దెబ్బతీసే ముప్పును ఎదుర్కొనడానికి తమ మతాన్ని సాధికారం చేయడంపైనే ఈ ఉపన్యాసం ఉందని చెప్పారు. ఫలానా మతస్థులపై నరమేధానికి పాల్పడాలనే పిలుపు ఈ ప్రసంగంలో లేదని తెలిపారు.