Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలపట్టలో భారీ ర్యాలీ
తిరువనంతపురం: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న అవాంఛనీయ ఘటనల అనంతరం వేనాడ్ జిల్లా కేంద్రమైన కలపట్టాలో కాంగ్రెస్ గూండాలు హింసాత్మక దాడులకు పాల్పడ్డారు. సిపిఎం కార్యాలయాలపైనా, దేశాభిమాని పత్రిక బ్యూరో కార్యాలయంపైనా దాడులు చేశారు. ఈ దాడులను నిరసిస్తూ వేనాడ్ జిల్లా అంతటా ప్రజలు ఆదివారం భారీ ప్రదర్శనలు నిర్వహించారు. వేలాది మందితో కలపట్టలో జరిగిన నిరసన ప్రదర్శనను సిపిఎం జిల్లా కార్యదర్శి పి గగారియన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేనాడ్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ తన నియోజకవర్గాన్ని ఒక పర్యాటక కేంద్రంగానే భావించి విహార యాత్రకు వచ్చినట్టు వెళ్తుంటారే మినహా నియోజకవర్గ అభివృద్ధిని కానీ, ప్రజల కష్టసుఖాలను కానీ పట్టించుకోవడం లేదని గగారియన్ విమర్శించారు. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఇందుకే నిరసన తెలియజేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సికె శశీంద్రన్ తదితరులు కూడా పాల్గొన్నారు.