Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో అరెస్టయి మెడికల్ బెయిలుపై ఉన్న పి.వరవరరావుకు మధ్యంతర ఊరట లభించింది. వరవరరావు మెడికల్ బెయిల్ను ఈ నెల 19 వరకూ సుప్రీంకోర్టు పొడిగించింది. వరవరరావుకు శాశ్వత బెయిలు మంజూరు చేయడానికి ఏప్రిల్ 13న ముంబాయి హైకోర్టు నిరాకరిస్తూ మూడు నెలలు మాత్రమే మెడికల్ బెయిలు పొడిగించింది. దీన్ని సవాల్ చేస్తూ వరవరరావు దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం జస్టిస్ ఉదరు ఉమేష్ లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ సుధాంశు ధులియాలతో కూడిన ధర్మాసనం విచారించింది. విచారణ వాయిదా వేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తరపు సొలిసిటర్ జనరల్ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అయితే, మంగళవారంతో వరవరరావు మెడికల్ బెయిలు పూర్తి కావడంతో తదుపరి విచారణ వరకూ మెడికల్ బెయిలు పొడిగింపునకు అభ్యంతరం లేదని తెలిపారు. దీనికి పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ అంగీకరించారు. ''ఇరు పక్షాల న్యాయవాదులు విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణ ఈ నెల 19కు వాయిదా వేస్తున్నాం. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ పిటిషనర్ మధ్యంతర రక్షణకు అనుమతిస్తున్నాం'' అని ధర్మాసనం స్పష్టం చేసింది.