Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదలకు ఉపయోగంగా లేని పథకం
న్యూఢిల్లీ : ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి ఆరోగ్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2018 సెప్టెంబరులో ప్రారంభించిన ప్రధాని జన్ ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై) లక్ష్యానికి దూరంగా నిలిచింది. ఆయుష్మాన్ భారత్ కింద దీనిని ప్రారంభించారు. యాభై కోట్ల మంది లబ్దిదారులకు ఐదు లక్షల రూపాయల వరకూ ఆరోగ్య బీమా సౌకర్యాన్ని వర్తింపజేయాలని నిర్దేశించుకున్నారు. అయితే బలహీన వర్గాల వారు ఈ పథకాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారని లాన్సెట్ రీజనల్ హెల్త్లో ప్రచురితమైన నివేదిక ఎత్తిచూపింది. 2018-2022 మధ్యకాలానికి సంబంధించి దీనిని రూపొందించారు. దీని ప్రకారం... ఈ పథకం విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. పథకం గురించి తెలిసి కూడా నమోదు చేసుకున్న వారి సంఖ్య చాలా తక్కువ. అంటే బలహీన వర్గాల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రారంభించిన ఈ పథకం దానిని చేరుకోవడంలో విఫలమైంది.
షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతులు, ముస్లింలతో పాటు పిల్లలు, వృద్ధులు ఉన్న పేద కుటుంబాల వారు తమ కుటుంబ ఖర్చులో 10 శాతానికి పైగా వైద్య సేవల కోసం వినియోగిస్తున్నారు. పట్టణ ప్రాంతాలు, అభివృద్ధి చెందిన ధనిక రాష్ట్రాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలు, పేద రాష్ట్రాల్లో ఈ వ్యయం అధికంగా ఉంటోంది. పీఎంజేఏవై కింద అందించే సేవల విషయంలో అసమానతలు కొట్టొచ్చినట్లు కన్పిస్తున్నాయి. వైద్య సేవలు అందించే ఆస్పత్రులు, వైద్య పరికరాలు, మందులకు సంబంధించి సరైన సమాచారం లేదు. పెద్దగా అవసరం లేని రాష్ట్రాలకు సేవలు బాగా అందుతుంటే బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అసోం వంటి వెనుకబడిన రాష్ట్రాలలో పేదలకు ఈ పథకం పెద్దగా అందుబాటులో లేకుండా పోయింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన జిల్లాలకు చెందిన లబ్దిదారులను అతి తక్కువ సంఖ్యలో గుర్తిస్తున్నారు. జార్ఖండ్, ఒడిసా, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాలలో ఇలాంటి ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. పురుషులు, మహిళలు సమానంగానే ఈ పథకంలో పేర్లు నమోదు చేసుకుంటున్నప్పటికీ లబ్దిదారుల్లో పురుషులే ఎక్కువగా ఉంటున్నారు. ఈ పథకానికి ఎస్సీ, ఎస్టీలే ఎక్కువగా అర్హులు. అయితే వీరి సంఖ్యలో గణాంకాలు అందుబాటులో లేవు. అయితే పథకం ప్రారంభించినప్పటి నుంచీ ప్రయివేటు ఆస్పత్రుల్లో చేరుతున్న వారిలో ఎస్సీ, ఎస్టీలు వరుసగా వారి జనాభాలో ఐదు శాతం, రెండు శాతం మాత్రమే ఉంటున్నారు. దీనిని బట్టి ఈ పథకం వారికి ఏ మాత్రం ప్రయోజనకరంగా లేదన్న విషయం అర్థమవుతోంది. పీఎంజేఏవైలో ఎన్ని మార్పులు చేసినప్పటికీ అది ఆశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది.