Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంచి ప్రతిస్పందన వచ్చిందన్న ప్రభుత్వం
- ఉదాసీనత కూడదన్న ఐఎంఎ
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో కోవిడ్ సన్నద్ధతను పరీక్షించేందుకు దేశవ్యాప్తంగా ప్రధాన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సోమ, మంగళవారాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, కర్ణాటక, ముంబయిల్లో పలు ఆస్పత్రుల్లో ఈ డ్రిల్స్ జరిగాయి. ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో డ్రిల్ను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ స్వయంగా వీక్షించారు. నాణ్యత కలిగిన క్లినికల్ పద్ధతులను, ఇన్ఫెక్షన్ నియంత్రణా చర్యలను, ఆస్పత్రి నిర్వహణను, పారిశుధ్య క్రమాన్ని, రోగికి ప్రాముఖ్యతనిచ్చే నిబంధనలను పాటించేలా ఆస్పత్రులు చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. ఈ మాక్ డ్రిల్స్కు దేశవ్యాప్తంగా మంచి ప్రతిస్పందన లభించింది. మంత్రులు, సీనియర్ అధికారులు ఆస్పత్రుల్లో ఏర్పాట్లను సమీక్షించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
కొత్తగా తలెత్తిన కరోనా వైరస్ వేరియంట్ ఎక్స్బిబి.1.16 కారణంగా ఇటీవల కేసులు బాగా పెచ్చరిల్లుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వేరియంట్ మ్యుటేషన్లు జరిగి కొత్త రకం పుట్టుకొచ్చిందని ఆ వైరస్కు సంబంధించిన కేసులే దేశంలో వివిధ ప్రాంతాల్లో వంద వరకు నమోదయ్యాయని ఆ ప్రకటన తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్లలో ఎక్స్బిబి అనేది ప్రస్తుతం బాగా ప్రబలుతోంది. గత 15 మాసాల్లో దీనికి సంబంధించి 400 కేసులు గుర్తించారు. వీటిల్లో 90శాతం ఎక్స్బిబి వే. కోవిడ్ వ్యాక్సిన్ను, బూస్టర్ డోస్ను తీసుకోవాల్సిందిగా ఇండియన్ మెడికల్ అసోసి యేషన్ (ఐఎంఎ) సిఫార్సు చేసింది. యాంటీబయాటిక్స్కు ఇందులో ఎలాంటి పాత్ర లేదని తెలిపింది. రోజూ క్రమం తప్పకుండా ఉప్పునీరును పుక్కిలించడం వల్ల కరోనా వైరస్ రాకుండా రక్షణ వుంటుందనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. ఇటీవల కాలంలో కోవిడ్ జాగ్రత్తలు పాటించడంలో ఉదాసీనత కారణంగానే కేసుల సంఖ్య పెరిగిందని తెలిపింది. పరీక్షలు ఎక్కువగా చేయకపోవడం, జాగ్రత్తలు సరిగా పాటించకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా వున్నాయని ఐఎంఎ తెలిపింది. ఒకవేళ లక్షణాలున్నా వారు పరీక్షలు చేయించుకోవడానికి తిరస్కరించడంతో వైరస్ బయటకు తెలియకుండానే వ్యాప్తి చెందడానికి కారణమవుతోందని పేర్కొంది. వృద్ధులు, గర్భవతులు, తీవ్ర జబ్బులతో బాధపడుతున్న వారికి కోవిడ్ ముప్పు నుండి రక్షణ కల్పించాల్సిన అవసరముందని ఐఎంఎ పేర్కొంది.