Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 మందిలో 29 మంది కోటీశ్వరులు
- సగటు సంపద రూ.33.96 కోట్లు
- రూ. 510 కోట్లతో టాప్ ప్లేస్లో ఏపీ సీఎం జగన్
- రూ. 15 లక్షలతో చివరి స్థానంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమత :ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూ నివేదిక
న్యూఢిల్లీ : భారత్లోని వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులే ఉన్నారు. వీరి సగటు సంపద రూ. 33.96 కోట్లుగా ఉన్నది. రూ. 510 కోట్ల విలువైన ఆస్థులతో ఏపీ సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి మొదటి స్థానంలో ఉన్నారు. రూ. 15 లక్షల సంపదతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చివరి స్థానంలో ఉన్నారు. ఎన్నికలలో భాగంగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమర్పించిన పోల్ అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) విశ్లేషించి సమాచారాన్ని రూపొందించింది.
ఏడీఆర్, ఎలక్షన్ వాచ్ డాగ్ (ఎన్ఈడబ్ల్యూ) సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక సమాచారం ప్రకారం.. భారత్లో మొత్తం 28 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల (ఢిల్లీ, పుదుచ్చేరి)కు మొత్తం 30 మంది ముఖ్యమంత్రులున్నారు. ఈ 30 మంది సీఎంలలో 29 మంది (97 శాతం మంది) సగటు ఆస్థి విలువ రూ. 33.96 కోట్లుగా ఉన్నది. టాప్ 3 స్థానాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ (రూ. 510 కోట్లు), బీజేపీకి చెందిన అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ ( రూ. 163 కోట్లు), ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (రూ. 63 కోట్లకు పైగా) ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వద్ద 23.55 కోట్లు ఆస్తి ఉన్నది.
ఆ ముగ్గురి ఆస్థులు తక్కువ
తక్కువ ఆస్థులను కలిగి ఉన్న ముఖ్యమంత్రుల్లో మమతా బెనర్జీ (రూ. 15 లక్షలకు పైగా) మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో కేరళ సీఎం పినరయి విజయన్ (రూ. 1 కోటికి పైగా), హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ (రూ. 1 కోటికి పైగా) లు ఉన్నారు. ఇక బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ల ఆస్థుల విలువ ఒక్కొక్కరికి రూ. 3 కోట్లకు పైగా ఉన్నాయి. ముఖ్యమంత్రుల్లో పలువురిపై నేరపూరిత కేసులు కూడా ఉన్నాయి. 13 మందిపై తీవ్రమైన నేరపూరిత కేసులు (హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, క్రిమినల్ ఇంటిడిమేషన్) ఉన్నాయి.