Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లౌకిక, ప్రత్యామ్నాయం కోసం చర్చలు
- ఎన్నికల తరువాత ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి :ఏచూరి
- ఏచూరి, డి.రాజాతో నితీశ్ భేటీ
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాట్లు జరగాలనీ, ఎన్నికల తరువాతే ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి ఏర్పడుతుందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ధ్యేయమని అన్నారు. గరిష్టంగా బీజేపీ వ్యతిరేక ఓట్లు పోల్ అవ్వాలనీ, రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటుకు అంగీకరించాలని సీపీఐ(ఎం) కోరుకుంటుందని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి సీట్ల కేటాయింపు జరగాలనీ, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు అవసరమైన రాజీలు చేసుకోవాలని సూచించారు. ప్రతిపక్షాల ఐక్య ఉద్యమాన్ని వేగవంతం చేసేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గురువారం నాడిక్కడ సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు ఇతర నేతలను కలిశారు. సమావేశానంతరం సీతారాం ఏచూరి విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్షాల ఐక్యత కోసం ప్రయత్నాలు ఊపందుకున్నాయనీ, లౌకిక ప్రత్యామ్నాయం కోసం చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రాజకీయ పరిస్థితులు ఉన్నాయని, ఆయా రాష్ట్రాల పరిస్థితులకనుగుణంగా సీపీఐ(ఎం) రాజకీయ పొత్తుపై నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ గరిష్టంగా మత విభజనను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రజల జీవన సమస్యల పరిష్కారానికి బీజేపీ ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని, బతుకుదెరువు కష్టాల నుంచి దృష్టి మరల్చి విభజనను సద్వినియోగం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అయితే దీనికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకతాటిపై నిలబడాలని, ఇలాంటి కార్యక్రమాలకు సీపీఐ(ఎం) ముందుంటుందని తెలిపారు.ప్రతిపక్షాల ఓట్లను ఏకీకృతం చేయడం వల్ల కేవలం 37 శాతం ఓట్లు వచ్చిన పార్టీ (బీజేపీ) అధికారంలోకి వచ్చే పరిస్థితి రాదని అన్నారు. ప్రతిపక్షాల ఐక్యత ఇప్పుడు గణనీయంగా ఊపందుకున్నదనీ, వామపక్ష, లౌకిక, ప్రజాస్వామ్య పార్టీల ఐక్యతతోనే బీజేపీని ఓడించవచ్చని పేర్కొన్నారు. 1996, 1998, 2004 మాదిరిగానే ఎన్నికల తరువాతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కూటమి ఏర్పడుతుందని స్పష్టం చేశారు. త్వరలో ప్రతిపక్ష పార్టీల సమావేశం నిర్వహించి వ్యూహాలు రచించనున్నట్లు తెలిపారు. రాజ్యాంగాన్ని, దేశాన్ని పరిరక్షించేందుకు, ప్రజల జీవనోపాధిని కాపాడుకునేందు బీజేపీని ఓడించాలని పిలుపు నిచ్చారు. కేరళలో కాంగ్రెస్, తమ పార్టీ ప్రత్యర్థులనీ, బీజేపీ అక్కడ ప్రధాన పోటీలో లేదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు.అనంతరం సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాతో కూడా నితీశ్ సమావేశమయ్యారు. ప్రతిపక్షాల మధ్యు రాజకీయంగా ఏకాభిప్రాయం కుదిరిన తరువాతే మిగతా విషయాలపై నిర్ణయం తీసుకుంటామని కూడా రాజా స్పష్టం చేశారు.. ''ఆర్ఎస్ఎస్-బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఐక్యతపై చర్చించాం. దేశం గందరగోళంలో ఉంది. సమాజంలోని అన్ని వర్గాలు బీజేపీ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నాయి. లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతగా ప్రజాస్వామ్యాన్ని, ప్రజలను రక్షించడం తప్పనిసరి'' అని అన్నారు. నితీశ్ కుమార్ ఐక్య ప్రయత్నాలకు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పూర్తి మద్దతునిస్తుందని హామీ ఇచ్చింది. కేంద్ర ఏజెన్సీల వేటలో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జైలు పాలైన తరువాత కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు, ప్రతిపక్షాల ఐక్య ప్రయత్నాలకు దూరంగా ఉండటమే ఆప్ విధానంగా ఉండేది. ఒడిశాలో బీజేపీ విధ్వంసక ప్రయోగాలను ప్రారంభించినందున బీజేడీ కూడా ప్రతిపక్ష కూటమిలో చేరవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న నితీశ్ కుమార్ శుక్రవారం ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్తో భేటీ కానున్నారు.