Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటి నిబంధనల సవరణలపై ఐఎన్ఎస్
న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వం రూపొందించిన ఐటీ నిబంధనల సవరణపై ది ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిబంధన ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రచురిత మైన ఏ విషయమైనా అవాస్తవమైనదా లేక తప్పుడుదా లేక తప్పుదోవ వట్టిం చేదా అని నిర్ధారించేందుకు నిజనిర్ధారణ విభాగాన్ని ఏర్పాటు చేసే అధికారం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖకు దఖలు పడుతుంది. అలాంటి సమాచారాన్ని ప్రచురించడం లేదా ప్రసారం చేయడం వంటి పనులు చేయవద్దని, ఒకవేళ చేసి ఉంటే దానిని తొలగించాలని సోషల్ మీడియా వేదికలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, ఇతర సర్వీస్ ప్రొవైడర్లను శాసించే అధికారం కూడా ఈ విభాగానికి ఉంటుంది. దీనిపై ఈ నెల 6న జారీ చేసిన నోటిఫికేషన్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని ఐఎన్ఎస్ కోరింది. పాత్రికేయ వృత్తి పైన, దాని విశ్వసనీయత పైన తీవ్ర ప్రభావం చూపే ఇలాంటి నోటిఫికేషన్ను జారీ చేసే ముందు మీడియా సంస్థలు, పత్రికా యాజమాన్యాలతో కేంద్రం విస్తృతమైన, అర్ధవంతమైన చర్చలు జరపాలని సూచించింది. ప్రభుత్వ 'నిజ నిర్ధారణ' నిబంధనలపై ఐఎన్ఎస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. సంబంధిత మీడియా సంస్థల వాదనలు వినకుండా తీసుకునే ఏ నిర్ణయమైనా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని అభిప్రాయపడింది. అధికారిక గెజిట్లో నోటిఫై చేయడం ద్వారా అలాంటి విభాగాన్ని ఏర్పాటు చేయవచ్చునని పేర్కొంది. ఇలాంటి చర్య పత్రికలపై సెన్సార్షిప్ విధించడమే అవుతుందని, భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగకరమని ఐఎన్ఎస్ తెలిపింది.