Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొద్ది గంటల్లోనే మాట మార్చిన కేంద్ర సహాయ మంత్రి కులస్థే
- ఉదయం : విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై ముందుకెళ్లడం లేదు
- సాయంత్రం : అది నా ఒక్కడి చేతిలోనే లేదు
- ఉద్యమం కొనసాగుతుంది : ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
విశాఖ: వైజాగ్ స్టీల్ప్లాంట్పై కేంద్ర ప్రభుత్వం తన వంచనను కొనసాగిస్తోంది. పూటకో మాట.. రోజుకో ప్రకటనతో ప్రజలను, కార్మికులను బిజెపి సర్కారు మరింత గందరగోళానికి గురిచేస్తోంది. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్థే గురువారం ఉదయం వైజాగ్ పోర్టు కళావాణిలో జరిగిన రోజ్గార్ మేళా కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ 'ప్రైవేటీకరణపై ముందుకెళ్లడం లేదు' అని ప్రకటించారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలతో నగరంలోని నోవొటల్లో సాయంత్రం జరిగిన చర్చల్లో ప్రైవేటీకరణ చేయబోవడం లేదన్న స్పష్టమైన హామీ మంత్రి ఇవ్వలేదు. కొద్ది గంటల వ్యవధిలోనే ఆయన మాటల్లో మార్పు కనిపించడం బిజెపి అసలు నైజాన్ని వెల్లడించిందని పరిశీలకులంటున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం స్టీల్ప్లాంట్ అమ్మకంపై వెనక్కి తగ్గేది లేదని, ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించిన విషయం తెలిసిందే.
విశాఖలో మంత్రి పర్యటన సాగిందిలా...
ప్రధాన మంత్రి రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం పోర్టు కళావాణి ఆడిటోరియంలో కేంద్ర సంస్థల్లో ఉద్యోగులుగా ఎంపికైన వారికి నియామక పత్రాలను అందజేసేందుకు గురువారం కేంద్ర సహాయ మంత్రి కులస్థే విశాఖకు వచ్చారు. పత్రాల పంపిణీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ 'వైజాగ్ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇప్పటికిప్పుడే ముందుకెళ్లడం లేదు. విభాగాలను బలోపేతం చేస్తాం' అంటూ ప్రకటించారు. దీంతో స్టీల్ ప్లాంట్ కార్మికవర్గం, రెండు తెలుగు రాష్ట్రాల్లోకీ ఈ విషయం సామాజిక మాధ్యమాల ద్వారా వెళ్లింది. కేంద్ర మంత్రి ప్రకటన ఎంతో కొంత ఉపశమనం కలిగించింది అనుకునేలోపే 'అంతా నా చేతిలో లేదు. నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది' అని సాయిత్రానికి మాట మార్చారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలతో జరిగిన చర్చల సందర్భంగా కొన్ని ప్రతిపాదనలను పోరాట కమిటీ నేత జె.అయోధ్యరామ్ తదితరులు ఆయన ముందుంచగా పై విధంగా స్పందించారు. దీంతో కార్మికవర్గంలో మళ్లీ అలజడి నెలకొంది.
అసలేం జరిగింది ?
గురువారం మధ్యాహ్నం స్టీల్ప్లాంట్ యాజమాన్యం, స్టీల్ యూనియన్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట మార్చేశారు. ఈ సమావేశంలో విశాఖపట్నం ఎంపీ ఎంవివి సత్యనారాయణ కూడా ఉన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు మాట్లాడుతూ.. వైజాగ్ స్టీల్ప్లాంట్ను కేంద్రం స్ట్రాటజిక్ సేల్ కింద పెట్టడాన్ని నిలిపివేయాలని, ఇదివరకే ప్లాంట్ను అమ్మివేసే దిశగా వేసిన లీగల్ అడ్వైజరీ, ఆస్తుల మదింపు, ట్రాన్జాక్షన్ కమిటీలను రద్దు చేయాలని ప్రతిపాదన చేశారు. ఈ విషయమై మంత్రి 'అంతా నా చేతిలో ఏమీ లేదు. ఢిల్లీలో నేను మాట్లాడతాను. మీరు చేసిన ప్రతిపాదనలు తెలియజేస్తాను' అంటూ చెప్పుకొచ్చారు. కనుక ప్రైవేటీకరణ నుంచి కేంద్రం వెనక్కి వెళ్లడం లేదని స్పష్టమైంది.
తమ పోరాటం కొనసాగుతుందని, కేంద్రం ప్రైవేటీకరణను ఉపసంహరిస్తూ స్పష్టమైన ప్రకటన చేసే వరకూ తమ నిరసనలు కొనసాగుతాయని చర్చల అనంతరం కార్మిక నేతలు స్పష్టం చేశారు. మరోవైపు ప్రజా వంచన ఆపి, స్టీల్ప్లాంట్ అమ్మకాన్ని నిలుపుతున్నట్టు కేంద్రం స్పష్టంగా ప్రకటించాలని సిపిఎం విశాఖ, అనకాపల్లి జిల్లా కార్యదర్శులు ఎం.జగ్గునాయుడు, కె.లోకనాథం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు.