Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ ఐక్యతకు భంగం కల్గించే చర్యలను తిప్పికొడదాం
- 'ఆవాజ్' బహిరంగ సభలో యూసుఫ్ తరిగామి
అనంతపురం: మంచి రోజులు తీసుకొస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన బిజెపి, అధికారంలోకి వచ్చాక పెట్టుబడిదారులకు మాత్రమే మంచి రోజులు తీసుకొచ్చేలా వ్యవహరిస్తోందని జమ్మూ కాశ్మీర్ శాసనసభలో సిపిఎం పక్ష నేత యూసుఫ్ తరగామి స్పష్టం చేశారు. అవాజ్ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆదివారం అనంతపురంలో బహిరంగ సభను నిర్వహించారు. సభలో తరగామి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు 'అచ్చేదిన్ ఆయేంగే' అంటూ ప్రచారాన్ని పెద్దఎత్తున బిజెపి చేపట్టిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రజలను విస్మరించి బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అంబాని, అదానీ వంటి వారి ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సామాన్యులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇలాంటివి మరుగుపరిచేందుకు మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి దేశ సమగ్రతను దెబ్బతీసే చర్యలు చేపట్టడం విచారకరమన్నారు. ఇటువంటి వాటిని ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలను మభ్యపెట్టడం తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదని విమర్శించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మతం పేరుతో ప్రజలను చీల్చే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా సమస్యలను ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు పరిహారం చెల్లించకుండానే భూములను పరిశ్రమల పేరుతో లాక్కుంటోందని తెలిపారు. ఇటువంటి వాటికి వ్యతిరేకంగా పోరాడితే నిర్బంధాలకు గురిచేస్తోందన్నారు. అయినా వాటికి ప్రజలు వెరవబోరని హెచ్చరించారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్ మాట్లాడుతూ.. దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చాక మైనార్టీలపై దాడులు పెరిగాయని వివరించారు. మోడీ ప్రధాన మంత్రి అయిన ఏడాదిన్నరలో మైనార్టీలపై దాడులు జరిగిన సంఘటనలు 110 చోటు చేసుకున్నాయని తెలిపా రు. దాద్రిలో గొడ్డుమాంసం తిన్నారని ఒకరిని చంపారని తెలిపారు. ఎటువంటి కారణాలు లేకుండానే మైనార్టీలపై దాడులకు తెగబడటం ఆందోళనకరమని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన పాలన దేశంలో సాగుతోందని విమర్శిం చారు. ఇటువంటి వాటిని ప్రజలు ఐకమత్యంతో తిప్పికొట్టాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఇంతియాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, రాయలసీమ అభివృద్ధి సబ్కమిటీ కన్వీనర్ జి.ఓబులు పాల్గొన్నారు.