Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఢిల్లీ అత్యాచార సంఘటనలో శిక్ష పడిన బాల నేరస్తుడి విడుదలను అడ్డుకోలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. డిసెంబర్ 16, 2012లో జరిగిన అత్యాచార ఘటనలో దోషిగా తేలిన బాలనేరస్తుడు డిసెంబర్ 20న విడుదల కానున్న నేపథ్యంలో హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉంటే తప్ప విడుదల అంశంలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. భారతీయ జనతా పార్టీ నేత, ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన వ్యాజ్యంపై స్పందించిన ద్విసభ్య ధర్మాసనం బాలనేరస్తుల చట్టం ప్రకారం దోషి మూడు సంవత్సరాల శిక్షను పూర్తి చేసుకున్నాడని న్యాయస్థానం స్పష్టం చేసింది.
నిర్భయ చట్టంలో మార్పులు తేవాలి-నిర్భయ తల్లిదండ్రులు
నిర్భయ చట్టం అమలులో ఉన్నప్పటికీ దేశంలో రోజు రోజుకీ అత్యాచార సంఘటనలు పెరిగిపోతున్నాయని ఢిల్లీ అత్యాచార ఘటనలో మృతిచెందిన నిర్భయ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లలోపే దోషులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని వాపోయారు. ఢిల్లీ అత్యాచార ఘటనలో శిక్ష పడిన నేరస్థుడి విడుదలను అడ్డుకోలేమని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో నిర్భయ తల్లిదండ్రులు పై విధంగా స్పందించారు. నిర్భయ చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.