Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో ఏడుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- హౌంమంత్రితో లెఫ్ట్ నేతల భేటీ
న్యూఢిల్లీ : ఉన్నత విద్యాసంస్థలపై 'సంఫ్ు' భల్లూకపు పట్టు బిగుస్తోంది. ఐఐటీ-మద్రాస్లో అంబేద్కర్-పెరియార్ స్టడీ సర్కిల్ గుర్తింపు రద్దుతో మొదలైన కాషాయ దాడి ఐఐటీ-ఢిల్లీ, ఎఫ్టిఐఐ, హెచ్సీయూల మీదుగా ఇప్పుడు దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి (జేఎన్యూ) విస్తరించింది. జేఎన్యూ క్యాంపస్ ఇప్పుడు ఇనుప బూట్ల వీరంగానికి వేదికైంది. కేంద్ర మంత్రులు రాజ్నాథ్, స్మృతి ఇరానీ 'సహించేది లేద'ంటూ చేసిన ఫర్మానాలతో పోలీసులు రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారు. 'జాతి వ్యతిరేక' నినాదాలు చేశారన్న ఆరోపణలతో శుక్రవారం విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్ అరెస్టు తర్వాత, శనివారం మరో ఏడుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్నయ్య లాగానే వారి పైనా రాజద్రోహం ఆరోపణలు ఉన్నాయంటున్నారు. అదుపులోకి తీసుకున్న ఈ ఏడుగురిని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్స్టేషన్కు తరలించారు. కేసుకు సంబంధించి వీరిని విచారిస్తున్నారని తెలిసింది. పరారీలో ఉన్న విద్యార్థులను పట్టుకోవడం కోసం సహకరించాల్సిందిగా పోలీసులు శుక్రవారం సాయంత్రం వర్సిటీ వీసీకి లేఖ రాశారు. శుక్రవారం కోర్టులో కన్నయ్య కస్టడీని కోరుతూ ఢిల్లీ పోలీసులు మరో ఐదుగురి పేర్లు వెల్లడించారు. వీరిలో అఫ్జల్ గురుకు సంబంధించిన వివాదాస్పద కార్యక్రమ నిర్వాహకుడు ఉమర్ ఖాలిద్ పేరు, జేఎన్యూ విద్యార్థి సంఘం సభ్యుడు రామా నాగా పేర్లున్నాయి.
జేఎన్యూలో పోలీసు చర్యలు ఆపండి : విద్యావేత్తలు
జేఎన్యూలో శుక్రవారం పోలీసులు పాల్పడ్డ అణచివేత చర్యలను ప్రముఖ విద్యావేత్తలు, వివిధ మేధోరంగ ప్రముఖులు ఖండించారు. జేఎన్యూలోనూ, దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న ఈ తరహా చర్యలను వెంటనే ఆపాలని వారొక లేఖలో డిమాండ్ చేశారు. అయితే, ఫిబ్రవరి 6 నాటి కార్యక్రమంలో చేసిన బాధ్యతారహితమైన నినాదాలను కూడా వారు ఖండించారు. అందుకు బాధ్యులెవరైనా, ఇలాంటి నినాదాల వల్ల సీరియస్గా చర్చించాల్సిన రాజకీయాంశాలు పక్కదారి పడతాయని వారు హెచ్చరించారు. మరణశిక్షల గురించి గానీ, మానవ హక్కుల ఉల్లంఘన గురించి గానీ, స్వయంనిర్ణయాధికార హక్కు గురించి గానీ చర్చించే వారు ఇలా బాధ్యతారహితంగా వ్యవహరించడం సిగ్గుచేటని వారన్నారు. ఈ ధోరణిని కచ్చితంగా విమర్శించాల్సిందేనని వారు తమ ప్రకటనలో తెలిపారు.
అయితే, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చర్చను మరింత లోతుగా నిర్వహించాలే తప్ప పోలీసు చర్యలు సరికాదని వారు స్పష్టం చేశారు. విద్యార్థులను వేధించేందుకు పోలీసులకు ఎలాంటి అధికారం లేదని వారన్నారు. విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ అరెస్టును ఖండిస్తూ ఆయనను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కన్నయ్య చేసిన ప్రసంగాల వీడియోలు ఆన్లైన్లో విస్తృతంగా అందుబాటులో ఉన్నాయని అంటూ, వాటిని చూస్తే ఆయనపై రాజద్రోహం కేసు పెట్టడానికి ఎలాంటి ఆధారమే కనిపించదని వారు స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయ వీసీ కూడా పోలీసులు, ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకోవడం విచారకరమని వారు అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్సింగ్, స్మృతి ఇరానీల ప్రకటనలు అభ్యంతరకరం అంటూ, వాటిని మేధావులు ఖండించారు. ఇది ఒక రకంగా విశ్వవిద్యాలయాలపై యుద్ధం ప్రకటించడం లాంటిదేనని వారు అభిప్రాయపడ్డారు.
ఉన్నత విద్యా సంస్థల్లో బీజేపీ ప్రభుత్వం సాగిస్తున్న దుర్మార్గమైన దాడిని వీరోచితంగా ప్రతిఘటిస్తున్న విద్యార్థుల పట్ల, జేఎన్యూ సిబ్బంది, ఉపాధ్యాయుల పట్ల వారు తమ సంఘీభావం ప్రకటించారు. ఈ ప్రకటనపై సంతకాలు చేసిన వారిలో భారతీ ఖేర్, గౌరీ గిల్, గీతా కపూర్, రాజశ్రీ దాస్గుప్తా, సంజరు కాక్ తదితరులున్నారు.
జేఎన్్యూ గొంతు నొక్కేవారే దేశద్రోహులు : రాహుల్
ప్రతిష్టాత్మక జేఎన్యూను మోడీ ప్రభుత్వం, ఏబీవీపీలు వేధింపులకు గురి చేస్తున్నాయని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. 'భారత వ్యతిరేక భావోద్వేగాలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. అయితే విభేదించే, వాదించే అధికారం ప్రజాస్వామ్యంలో అనివార్య భాగమ'ని ఆయన ట్వీట్ చేశారు. కానీ, జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ అరెస్టు విషయంలో మాత్రం ఆయన ఏమీ వ్యాఖ్యానించకపోవడం గమనార్హం. ఇటీవలే కేరళ పర్యటనను ముగించుకున్న రాహుల్కు ఆ రాష్ట్రంలో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో వామపక్షాలే ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నాయన్న విషయం తెలిసిందే. శనివారం ఆయన జేఎన్యూకు వెళ్లి విద్యార్థులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏబీవీపీ విద్యార్థులు నిరసన తెలుపుతూ నల్ల జెండాలు ప్రదర్శించారు. దీనిపై స్పందిస్తూ రాహుల్, 'ఈ విద్యాసంస్థ గొంతు నొక్కాలని చూసేవాళ్లే అసలైన దేశద్రోహులు' అని వ్యాఖ్యానించారు.
రాహుల్ది హఫీజ్ సయీద్ భాష : బీజేపీ
రాహుల్ గాంధీ, అతని అనుచరులు లష్కరేతోయిబా ఉగ్రవాది హఫీజ్ సయీద్ వంటి భాష మాట్లాడుతున్నారని బీజేపీ దుయ్యబట్టింది. ఒకవైపు దేశ సరిహద్దులు సైనికులు ప్రాణత్యాగం చేస్తుంటే, జేఎన్యూ వంటి విద్యా సంస్థల్లో భారత వ్యతిరేక నినాదాలు చేస్తున్నారని, టెర్రరిస్టులను అమరవీరులుగా కీర్తిస్తున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ అన్నారు. మరోవైపు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ సంఘటనపై స్పందించారు. 'జాతి వ్యతిరేకులను ఎవరూ సహించరు. కానీ ఆ సాకుతో నిర్దోషులైన విద్యార్థులను వేధించడం సహించరానిది' అని ఆయన అన్నారు.