Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 27,466 మెజార్టీతో టీడీపీ విజయం
- మూడు రాష్ట్రాల్లో..నాలుగు స్థానాల్లో అధికార పార్టీలదే గెలుపు
న్యూఢిల్లీ:మూడు రాప్ట్రాల్లో జరిగిన నాలుగు ఉపఎన్నికల్లో అధికార పార్టీలే విజయం సాధించాయి. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి 27,466 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఆసక్తిగా చూసిన నంద్యాల ఉప ఎన్నిక ఫలితాల్లో మొత్తం ఓట్లలో టీడీపీకి 56 శాతం ఓట్లు రాగా.. వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. ప్రతి రౌండ్లో భూమా అభ్యర్థిత్వానికే ఓటర్లు పట్టం కట్టారు. సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి ఏ దశలోనూ ఆధిక్యాన్ని కనబరచలేకపోయారు. ఇక కాంగ్రెస్ 1,382 ఓట్లకే పరిమితమైంది. నంద్యాల ఉప ఎన్నికను అటు అధికార టీడీపీ, ఇటు విపక్ష వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకో వడంతో.. ఈ ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందోనని తెలుగుప్రజలు ఉత్కంఠగా ఎదురు చూశారు.
టీడీపీ సంబురాలు..
నంద్యాలలో విజయంతో తెలుగుదేశం శ్రేణులు సంబురాల్లో మునిగితేలాయి. ఇటు తెలంగాణలోనూ నంద్యాల రిజల్ట్పై తెలుగుదేశం పార్టీ కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్లో టపాసులు కాల్చారు. స్వీట్లు పంచారు. చంద్రబాబు జిందాబాద్, జగన్ డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు.ప్రజలు అభివృద్ధికి ఓటు వేశారని నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విపక్ష నేత జగన్ తన తీరును మార్చుకోవాలని సూచించారు. దీనికి ప్రతిగా జగన్ మీడియా సమావేశం పెట్టి..నంద్యాల ఉపఎన్నికల రెఫరెండం కాదని, టీడీపీ 200 కోట్లు ఖర్చుపెట్టిందని ఆరోపించారు..
ఢిల్లీ బైపోల్ ఆప్దే..
ఢిల్లీలోని బావన అసెంబ్లీ స్థానంలో ఆమ్ఆద్మీపార్టీ అభ్యర్థి రామ్చందర్ 24,052 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.దేశరాజధానిలో జరిగిన బైపోల్లో ఎదగాలని బీజేపీ చేసిన వ్యూహం బెడిసికొట్టింది. ఆప్కు వస్తున్న వ్యతిరేకత కారణంగా..బీజేపీ వైపు ఓటరు మొగ్గుచూపుతాడని పార్టీ అధిష్టానం భావించింది. కానీ ఆ పార్టీ నేతలకు పరాభవం మిగిలింది.గోవాలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా బీజేపీ కైవసం చేసుకున్నది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్పారికర్ పనాజీ అసెంబ్లీ స్థానంలో 4803 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వాల్పోయి స్థానం నుంచి బీజేపీకి చెందిన విశ్వజిత్రాణే 10,066 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ స్థానాలకు ఆగస్టు 23న పోలింగ్ నిర్వహించగా, 28న ఓట్ల లెక్కింపు జరిగింది.