Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నామమాత్రంగానే నోటిఫికేషన్లు
- లక్షన్నర ఖాళీలు.. వేలల్లోనే భర్తీ
హైదరాబాద్ : రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరీక్షణ తప్పడం లేదు. ఉద్యోగ ఖాళీలపై కాకి లెక్కలు చూపుతున్నారనే విమర్శలూ లేకపోలేదు. ఎన్నికల ప్రచారంలో 'బాబు వస్తే జాబు వస్తుంది' అని టీడీపీ నమ్మబలికింది. కానీ మూడేండ్లలో నామమాత్రంగానే నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపకానికి ఏర్పాటైన కమల్నాథన్ కమిటీ తేల్చిన లెక్కల ప్రకారం ఏపీిలో సుమారు 1,42,825 ఖాళీలున్నాయి. 20,250 ఉద్యోగాలు భర్తీ చేస్తామని గతేడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటన చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 10 వేల ఉద్యోగాలే భర్తీ చేస్తామంటూ మే నెలలో మరో ప్రకటన చేశారు. తీరా 2016లో ఎపీపీిఎస్సీ ద్వారా కేవలం 4,160 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు జారీ చేశారు. వీటిలో గత ఏడాది ఆగస్టులో 748 పోస్టులతో తొలి నోటిఫికేషన్ విడుదలకాగా, సెప్టెం బర్లో 149 పోస్టులతో అసిస్టెంట్ ఇంజనీర్ నోటిప ˜ికేషన్ విడుదలైంది. నిరుద్యోగులు ఎక్కువగా ఆశలు పెట్టుకున్న గ్రూప్ 1, 2, 3ల్లోనూ నామమాత్రపు పోస్టులతోనే నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. గ్రూప్స్లో 74 పోస్టులతో గ్రూప్-1, గ్రూప్-2లో 982 పోస్టులు, 1055 పోస్టులతో గ్రూప్-3 నోటిఫికేషన్లు విడుద లయ్యాయి. వీటితో పాటు డిప్యూటీ సర్వేయర్లు, టౌన్ ప్లానింగ్ సర్వేయర్ వంటి 361 గ్రేడ్-1 పోస్టులు, 504 డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టులతో దాదాపు 20 విభాగాల్లో నోటిఫికేషన్ల విడుదలయ్యాయి. వీటిలో చాలా వరకు టెక్నికల్ పోస్టులుండటం, అవి కూడా ప్రతి విభాగంలో సింగిల్ డిజిట్లోనే ఉండటం గమనార్హం. 2017లో మరికొన్ని నోటిఫికేషన్లంటూ ఎపీపీిఎస్సీి వార్షిక క్యాలెండర్ను ఈ ఏడాది ఏప్రిల్లో విడుదల చేసింది. మొత్తం 42 శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించింది. కానీ ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనేది స్పష్టం చేయలేదు. గతేడాది విడుదలైన నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించడంతో సరిపోయింది. సెప్టెంబర్ దాటినా ఈ ఏడాది ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. కమల్నాథన్ కమిటీ తేల్చిన లెక్కల ప్రకారం 1,42,825 ఖాళీలు సహా ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం ఈ మూడేండ్లలో వివిధ శాఖల్లో రిటైర్మెంట్ అయిన పోస్టులు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు ద్వారా ఖాళీలు మరో 79 వేల వరకు ఉన్నాయి. ఇవికాక ఉపాధ్యా య ఖాళీలు 45 వేల వరకు ఉన్నాయి. పోలీసు శాఖలోనే మరో 15 వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని ప్రభుత్వమే లెక్కతేల్చింది.
తెలంగాణలోనూ ఇదే పరిస్థితి
తెలంగాణలో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైనా, అది కాస్తా కోర్టు పరిధిలో ఉంది. దీనికి ముందే టెక్నికల్ విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైనా, వాటిలో చెప్పుకోదగిన సంఖ్యలో పోస్టులు లేవు. వివిధ శాఖల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 1,07,744 ఖాళీలున్నాయి. వీటిలో పాఠశాల విద్యాశాఖలో 24,861, ఉన్నత విద్యాశాఖలో 10,592, హోంశాఖలో 15, 339, రెవెన్యూ శాఖలో 10,142, సచివాలయంలో 510 ఖాళీలున్నట్టు అధికార వర్గాలు గతంలోనే ప్రకటిం చాయి. రాష్ట్ర విభజన తర్వాత ఇంతవరకు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఇటీవల గురుకుల పాఠశాలల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినా, కోర్టు కేసుల కారణంగా వాయిదాలు పడుతూ వస్తోంది. నిరుద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల పోరాటాల ఫలితంగా వివిధ క్యాటగిరీల్లో 8,452 ఉపాధ్యాయ కొలువుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగల్ ఇచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ 48,070 కొత్త ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈహామీ అయినా ఏ మేరకు అమలు కాగలదనేది సందేహాస్పదమేనని నిరుద్యోగులు పెదవి విరుస్తున్నారు.