Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎపి కాంట్రాక్ట్ ఎఎన్ఎమ్లు ఆందోళన బాట పట్టారు. అన్ని జిల్లాల నుంచి వందలాది మంది ఎఎన్ఎమ్లు సోమవారం చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ నుంచి ధర్నాచౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎ. మాధవి అధ్యక్షత వహిస్తూ, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంచుతూ ఇచ్చిన జీవో 151 ప్రకారం సెకండ్ ఎఎన్ఎమ్ల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. వీరికీ 180 రోజుల ప్రసూతి సెలవులు, ఏటా 35 రోజుల సాధారణ సెలవులు పునరుద్ధరించాలని కోరారు. రెగ్యులర్ ఎఎన్ఎమ్లకు మాదిరిగా ఐచ్ఛిక, పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఎ.వి. నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల హామీ ప్రకారం కాంట్రాక్ట్ ఎఎన్ఎమ్లను రెగ్యులరైజ్ చేయాలన్నారు. రెగ్యులరైజేషన్కు సుప్రీంకోర్టు ఆదేశాలు అడ్డువస్తు న్నాయంటూ ప్రభుత్వం సాకులు చెబుతోందని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను మాత్రం ప్రభుత్వం పాటించడం లేదన్నారు. గర్భిణులకు జాగ్రత్తలు చెప్పే ఎఎన్ఎమ్లకే ప్రసూతి సెలవులు కల్పించకపోవడం సరికాదన్నారు. వైద్య ఆరోగ్య సేవలన్నీ పూర్తిగా ప్రయివేటీకరణ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.