Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 663 మంది పౌరులకు ఒకరు..
- భారత్లో ఖాకీల రక్షణ తీరిది : బీపీఆర్ అండ్ డీ అధ్యయనం
న్యూఢిల్లీ : వీఐపీ సంస్కతి రోజురోజుకూ పెరుగుతోంది. మోడీ అధికారంలోకి వచ్చాక.. గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరగటంపై అటు భద్రత దళాలతో పాటు ఇటు జనంలోనూ చర్చనీయాంశమవుతున్నది. తాజాగా పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్ అండ్ డీ) ఇటీవల నిర్వహించిన సర్వే గణాంకాలు విస్మయకరమైన వాస్తవాలను వెల్లడించింది. వీఐపీ సంస్కతి దేశంలో చాలా ఎక్కువగా ఉన్నదని ఈ సర్వే నిర్ధారించింది. గణాంకాల ప్రకారం... దేశంలో ఒక్కో వీఐపీకీ భద్రతగా ముగ్గురు పోలీసులు పనిచేస్తున్నారు. కానీ 663 మంది పౌరులకు మాత్రం ఒక్క పోలీసే ఉన్నారు. 20,000 మంది వీఐపీలకు సగటును ముగ్గురు పోలీసులు రక్షణ కల్పిస్తుండగా... సాధారణ పౌరులకు మాత్రం పోలీసుల కొరత తీవ్రంగా ఉన్నది. దేశంలో మొత్తం 19.26 లక్షల పోలీసు అధికారులుంటే, 29 రాష్ట్రాలు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 20,828 మంది వీఐపీల భద్రత కోసం 56,944 మంది పోలీసులను నియమించారు. అంటే ప్రతీ ఒక్క వీఐపీకి సగటును ముగ్గురు పోలీసులు పనిచేస్తున్నారన్నమాట. దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఈ వీఐపీ సంస్కృతి సర్వసాధారణమైందని బీపీఆర్అండ్డీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా బీహార్లో మాత్రం ఈ నిష్పత్తి తక్కువగా ఉంది. 3,200 మంది వీఐపీలకు 6,248 పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. బీహార్ తర్వాత పశ్చిమ బెంగాల్లో 2,207 వీఐపీలకు 4,233 పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1,901 మంది వీఐపీలకు 4,681 పోలీసులు, పంజాబ్లో 1,852 వీఐపీలకు 5,315 మంది పోలీసులు రక్షణగా ఉన్నారు. చివరగా, ఢిల్లీలో ప్రధానమంత్రి మరియు రాష్ట్రపతి, ఇతర ఉన్నతాధికారులకు కలిపి 489 వీఐపీల కోసం 7,420 మంది పోలీసులు పనిచేస్తున్నారు. పార్లమెంటు, సుప్రీంకోర్టు వంటి ఇతర ముఖ్యమైన కార్యాలయాలు, ఉన్నతస్థాయి సంస్థలు ఇక్కడి నుంచే పనిచేస్తుండటంతో ఢిల్లీలో వీఐపీల విధులను నిర్వహిస్తున్న పోలీసుల సంఖ్య సమర్థనీయమేనని ఈ నివేదిక పేర్కొంది.