Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎస్టీ దెబ్బకు పిండి మరలు విలవిల!
- సర్కారు నిలకడలేమితో సమస్యల్లో వ్యాపారులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రూపంలో రోజుకో కొత్త నిబంధన తీసుకువస్తుండడం దేశంలో వ్యాపారులకు సమస్యాత్మకంగా తయారైంది. తాజాగా బ్రాండె డ్ ఆహార ఉత్పత్తులపై అయిదు శాతం జీఎస్టీ పన్ను వర్తింపు నిబంధనతో దేశంలోని దాదాపు 1400 బడా పిండి మిల్లులు మూత పడే పరిస్థితి నెలకొంది. ట్రేడ్మార్కు రహితంగా.. ప్యాకింగ్ లేకుండా విడిగా విక్రయించే ఆహార ఉత్పత్తులను కొత్తగా అమలులోకి తెచ్చిన జీఎస్టీ పరిధి నుంచి తాము మినహాయిస్తున్నట్టుగా సర్కారు మొదట్లో ప్రకటించింది. ఈ నేపథ్యంలో బడా పిండి మిల్లుల వారు పన్నుపోటును తప్పిం చుకొనేందుకు గాను ట్రేడ్ మార్క్ను తిరిగి సర్కారుకు
అప్పగించేశారు. స్థానిక, జాతీయ సంస్థల వద్ద తమ సంస్థలను నమోదు చేసుకున్నారు. కానీ తాజాగా సెప్టెంబరు 9న సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ ట్రేడ్మార్క్తో సంబంధం లేకుండా ప్యాక్ చేసిన అన్ని ఉత్పత్తులపై 5 శాతం పన్ను భారం వేయనున్నట్టు ప్రకటించడంతో పిండి మరల యజమానుల గుండెల్లో రాయిపడినట్టయింది. పన్ను వర్తింపుతో పాటు జీఎస్టీ అమలులోకి వచ్చిన జులై నుంచి విక్రయించిన స్టాక్నకు పన్ను చెల్లించాలని సర్కారు వర్గాలు చెబుతున్నాయి. దీంతో పిండి మరల యజమానులు దిక్కుతోచని స్థితిలోకి జారుకున్నారు. సర్కారు నుంచి మరింత స్పష్టత రాని నేపథ్యంలో వారు తమ వ్యాపారాలను మూసుకొనే పరిస్థితి కనిపిస్తోంది. అనధికారిక సమాచారం మేరకు దేశంలో దాదాపు 2000 వరకు బడా పిండి మరలు పని చేస్తున్నాయి. ఇవి దేశంలో భారీగా బ్రెడ్తో పాటు ఇతర ప్రాసెసింగ్ ఫుడ్ ఉత్పత్తుల తయారీకి గాను గోధుమ పిండి, బేసిన్, మైదా వంటి పిండ్లను అందిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు జీఎస్టీ దెబ్బతో ఇందులో మూడో వంతు అంటే దాదాపు 1400 పిండి మరలు మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.