Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్ర్రజాధనం నీటిపాలు
పాట్నా: 389 కోట్లతో నిర్మించి భటేశ్వరాస్థాన్ పంప్ కెనాల్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ప్రారంభోత్సవానికి అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. వార్తాపత్రికల్లో ప్రకటనలూ ఇచ్చారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జల వనరుల శాఖ మంత్రి రాజీవ్రంజన్ సింగ్ లల్లాన్ కూడా పాల్గొంటున్నట్టు ప్రకటనలు ఇచ్చారు. తీరా ప్రారంభానికి కొద్దిగంటల ముందు ఆ డ్యామ్ గోడ కుప్పకూలింది. బీహార్లో బుధవారం ఉదయం ఈ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. డ్యామ్ గోడ కూలడంతో బాగల్పూర్ నగరం నీట మునిగింది. ప్రాజెక్టు గోడ కూలడంతో తీవ్ర గందరగోళానికి గురైన జలవనరుల మంత్రి లల్లాన్ సింగ్ మీడియాతో మాట్లాడారు. 'పూర్తి సామర్థ్యంతో నీళ్లను ఒక్కసారిగా వదలడం వల్లే ఈ ప్రమాదం జరిగింది' అన్నారు. బీహార్, పొరుగు రాష్ట్రం జార్ఖండ్లో వ్యవసాయ భూమికి నీటిని అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. డ్యాం కూలిపోవడంతో బుధవారం జరగాల్సిన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. భగల్పూర్లోని కహల్గాన్ వద్ద దీనిని నిర్మించేందుకు బీహార్, జార్ఖండ్ ప్రభుత్వాలు సంయుక్తంగా రూ. 389.31 కోట్లు ఖర్చుచేశాయి. కెనాల్లోని నీటిని నిల్వచేసి భగల్పూర్లో 18,620 హెక్టార్లు, జార్ఖండ్లోని గొడ్డా జిల్లాలో 22,658 హెక్టార్ల మేర సాగునీటిని అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. తొలుత దీనిని నిర్మించేందుకు రూ.13.88 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. 1977లో అప్పటి ప్రణాళికా సంఘం రూ. 13.88 కోట్ల ఈ పథకానికి ఆమోదం తెలిపింది. గోడ కూలడంతో ఒక్కసారిగా పొంగుకొచ్చిన వరదతో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లన్నీ జలమయం అయ్యాయి. అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.