Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుంటూరు శివారు అడవి తక్కెళ్లపాడులో విషాదం
గుంటూరు:కుక్కలు దాడి చేసిన ఘటనలో ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన గుంటూరు రూరల్ మండలం అడవి తక్కెళ్లపాడులో గురువారం చోటుచేసుకుంది. అడవి తక్కెళ్లపాడు లోని రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న డి.ఏసు, మల్లీశ్వరి దంపతుల కుమారుడు ప్రేమ్కుమార్(5) ఇంటి ముందు రోడ్డుపై ఆడుకుంటుండగా మూడు వీధి కుక్కలు దాడి చేశాయి. పొట్ట భాగంతోపాటు పలుచోట్ల కరవడంతో తీవ్రగాయాలై రక్తం అధికంగా పోయింది. బాలుడు రోడ్డుపై బోర్లాపడి పైకి లేవలేక అత్యంత దీనంగా మూలుగుతూనే ఉండిపోయాడని స్థానికులు చెబుతున్నారు. బాలుడి తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లొచ్చిన తర్వాత బాలుడ్ని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. చికిత్స ప్రారంభించిన కొద్ది సేపటికే మృతి చెందాడు. గుంటూరులో పగలూ, రాత్రి తేడా లేకుండా కుక్కలు స్వైర విహారం చేస్తున్నా కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా తాము కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేస్తున్నామని కమిషనర్ సి.అనూరాధ పేర్కొన్నారు.