Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి:రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా పెట్టుబడులు పెట్టకుండా లెఫ్ట్ వింగ్లు, ప్రతిపక్ష పార్టీలు అడ్డుకుంటున్నాయని కమ్యూనిస్టులపై సీఎం చంద్రబాబు కస్సుబుస్సు లాడారు. శాంతిభద్రతలపై జరిగిన సమీక్షలో తాము అందరినీ కలపాలని చూస్తుంటే ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. ఆక్వా, ఫార్మా ఇండిస్టీలు రాకూడదంటున్నారని వాటిని ఎక్కడ పెట్టాలని ప్రశ్నించారు. తుందుర్రు, గరికపర్రు, దేవరపల్లి, పచ్చి కాపల్లం వంటి ఘటనలపైనా చర్చ సాగింది. ఈ సందర్బం గా శ్రీకాకుళం ఎస్పీ త్రివిక్రమ్ వర్మ, ప్రకాశం ఎస్పీ ఏసుబాబు, చిత్తూరు ఎస్పీ రాజశేఖర్బాబు, కర్నూలు ఎస్పీ గోపీనాధ్జెట్టిలు తమ జిల్లాల్లో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలు కట్టడి చేశామని సీఎంకు వివరించారు. జిల్లా స్థాయి సీపీఐ, సీపీఐ(ఎం) నేతలను జైళ్లకు పంపామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఆందోళనలు జరిగినప్పుడు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉండేలా బాడీ వార్న్ కెమెరాలతో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు సలహా ఇచ్చారు. అరాచక శక్తులకు రాష్ట్రంలో స్థానం లేదని డ్రగ్ డీలర్లు, వైట్ కాలర్ నేరగాళ్లూ రాష్ట్రంలో కనబడకూడదని సీఎం చంద్రబాబు పోలీస్ ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. కలెక్టర్ కాన్ఫరెన్స్లో భాగంగా గురువారం జిల్లాల ఎస్పీలతో ఆయన శాంతి భద్రతల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. బెట్టింగ్లు, సైబర్ నేరాలు, ల్యాండ్ గ్రాబింగ్లు, ఇతర అనైతిక చర్యలు రాష్ట్రంలో పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమంగా సంపాదించిన డబ్బు వల్లే నేరాలు పెరుగుతున్నా యని అభిప్రాయపడ్డారు. అటువంటి వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అదే విధంగా డ్రగ్స్ వినియోగం వల్ల వచ్చే నష్టాలను పాఠశాల, కళాశాల స్థాయిలో ప్రచారం చేయాలన్నారు. గంజాయి సాగు జాడ కనిపెట్టడానికి ద్రోణ్లను ఉపయోగించాలని సూచించారు. వాటి ద్వారానే ఆ పంటను నాశనం చేయాలన్నారు.