Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: మానసిక వికలాంగురాలైన కూతురు అవస్థలు పడుతుండడాన్ని ఆ తండ్రి చూడలేకపోయాడు. ఈ క్రమంలోనే ఆ అభాగ్యురాలిని చంపిన అతడు.. పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటు చేసుకున్నది. పోలీసులు గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం.. చెన్నైలోని నెర్కుడ్రం ప్రాంతానికి ఆదికేశవన్కు కూతురు కౌసల్య(17), కొడుకు(19) ఉన్నారు. మనస్పర్థల కారణంగా ఆదికేశవన్ భార్య అతడితో విడిపోయి కూతురుతో కలిసి వేరే చోట నివాసముంటోంది. కాగా ఇటీవల ఆదికేశవన్ ఇంటికి వచ్చిన అతడి భార్య.. కౌసల్యను అక్కడే వదిలి వెళ్లింది. కూతురు మానసిక వ్యాధి తగ్గేందుకు పలు ఆస్పత్రులకు తీసుకెళ్లాడు. అయినా నయం కాలేదు. ఇదిలాఉండగా బుధవారం ఉదయం 11.30 గంటలకు కౌసల్యకు మూర్చ వచ్చి కింద పడి కొట్టుకుంటుండగా.. ఆమె పడుతున్న బాధను ఆదికేశవన్ చూడలేకపోయాడు. ఈ క్రమంలోనే నైలాన్ తాడును ఆమె మెడకు బిగించి ప్రాణం తీశాడు. అనంతరం కోయంబేడు పోలీస్స్టేషన్లో లొంగిపోయి చేసిన దారుణాన్ని పోలీసులకు తెలిపాడు.