Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేషన్లను నిలిపివేయాలన్న కేంద్రం యోచన సరికాదు
- నేడు, రేపు దేశవ్యాప్త ఆందోళనలకు ఏఐఎఫ్ఏడబ్ల్యూహెచ్ పిలుపు
న్యూఢిల్లీ: ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్(ఐసీడీఎస్) పథకం కింద మూడేండ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న రేషన్లను నిలిపివేయాలనుకోవడం సరికాదని ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్(ఏఐఎఫ్ఏడబ్ల్యూహెచ్) తెలిపింది. ఈ ఆలోచనను, వెంటనే విరవించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా శుక్రవారం, శనివారం ఆందోళనలు చేపట్టి కేంద్రప్రభుత్వం దిష్టిబొమ్మలను దహనం చేయాలని ఏఐఎఫ్ఏడబ్ల్యూహెచ్ పిలుపునిచ్చింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న రేషన్(గుడ్లు, పాలు, ఇతర పోషక పదార్థాలు) స్థానంలో నగదు బదిలీ, లేదంటే ప్యాకింగ్ ఫుడ్ను అందించాలని కేంద్ర శిశుసంక్షేమ మంత్రిత్వ శాఖ కుట్రపూరితంగా ఓ ప్రతిపాదనను సిద్ధం చేసిందని చెప్పింది. ఇదే జరిగితే దేశవ్యాప్తంగా 26 లక్షల మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశమున్నదని తెలిపింది.
అంగన్వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న వారంతా పేద, మధ్య తరగతికి చెందిన మహిళలేనని వెల్లడించింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐసీడీఎస్ను నిర్వీర్యం చేయాలని చూస్తున్నదని విమర్శించింది. కేంద్రం కుట్రకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బంది నిరసనలు చేపట్టాలని కోరింది. రేషన్లకు బదులు నగదు బదిలీ విధానాన్ని తొలుత దేశంలోని 300 జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి, ఏడాది కాలం తర్వాత అన్ని ప్రాంతాలకు విస్తరింపజేయాలని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం.