Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా ప్రతినిధులపై సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ
న్యూఢిల్లీ: నేరాల కేసుల్లో దోషులుగా రెండేండ్లు,అంతకన్నా ఎక్కువకాలం జైలు శిక్షలు పడిన ప్రజాప్రతినిధులు వెంటనే పదవులు కోల్పోరని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కింది కోర్టుల్లో శిక్షలు ఖరారైన ప్రజాప్రతినిధులకు ఉన్నత న్కాయస్థానాల నుంచి స్టే తెచ్చుకునేందుకు అవకాశముంటుందని, అందువల్ల వారు పదవుల్లో కొనసాగవచ్చునని కేంద్ర న్యాయశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో వివరణ ఇచ్చింది. క్రిమినల్ కేసుల్లో రెండేండ్లు, అంతకన్నా అధికంగా శిక్షలు పడిన ప్రజాప్రతినిధుల పదవుల్ని రద్దు చేయాలని చట్టం చెబుతున్నది. అయితే, అలాంటివారు కొందరు ఇంకా పదవుల్లో కొనసాగుతున్నారని లోక్ప్రహరీ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టు దృష్టికి తేగా విచారణ జరుపుతున్నది. కోర్టు ఆదేశాల మేరకు ఈ అంశంపై కేంద్రం బుధవారం అఫిడవిట్ సమర్పించింది.
లిలీథామస్ కేసులో రెండేండ్లకన్నా అధికంగా శిక్షలుపడిన ప్రజాప్రతినిధుల పదవులు వెంటనే రద్దవుతాయని 2013లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కింది కోర్టుల్లో శిక్షలు పడి ఉన్నత కోర్టుల్లో విచారణ పెండింగ్లో ఉన్నాసరే పదవుల్లో కొనసాగేందుకు వీల్లేదని ఆ తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ తీర్పునకు ముందు శిక్షలు పడిన చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పదువుల్లో కొనసాగడం గమనార్హం. అక్రమ సంపాదన కేసుల్లో కింది కోర్టుల్లో శిక్షలు పడిన బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్యాదవ్, ఏఐఏడీఎంకే అధినేత్రి, కీ.శే.జయలలిత పదవుల్లో కొనసాగడాన్ని ప్రశ్నిస్తూ లిలీథామస్ అనే సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆ తీర్పు వెల్లడైంది.