Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరిగిన పెట్రోల్ ధరలపై ఆందోళన
ముంబయి: బీజేపీ అబద్ధపు వాగ్దానాల వల్ల ప్రజలకు అన్యాయం జరిగిందని, నోట్ల రద్దు ఓ కుంభకోణమని శివసేన యువ విభాగం యువ సేన అధ్యక్షుడు ఆదిత్యఠాక్రే విమర్శించారు. పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసన తెలపడం ద్వారా మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వా మిగా ఉన్న శివసేన ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషించింది. శనివారం ముంబయిలోని 10 ప్రాంతాల్లో శివసేన ఆందోళన చేపట్టింది. శివసేనకు చెందిన నేతలు తలా ఒకచోట ఆందోళనకు నేతృత్వం వహించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఆరోగ్యమంత్రిగా కొనసాగుతున్న దీపక్సావంత్, రాజ్యసభ ఎంపీ అనిల్దేశారు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. శివసేన చేపట్టిన ఆందోళనలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
బాంద్రాలో చేపట్టిన ఆందోళనకు ఆదిత్యఠాక్రే నేతృత్వం వహించారు. అధికారంలో భాగస్వామ్యమున్న శివసేన వీధుల్లో ఆందోళనకు దిగడం ఇదే మొదటిసారి. పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఆందోళన కొనసాగిస్తామని శివసేన ఎంపీ అనిల్ దేశారు హెచ్చరించారు. గత వారం తమ పార్టీ ప్రధాన కార్యాలయం మాతోశ్రీలో సమావేశమైన శివసేన భవిష్యత్ రాజకీయ వ్యూహంపై చర్చించింది. బీజేపీ తమ పట్ల సవతితల్లిలా వ్యవహరిస్తున్నదని సేనకు చెందిన పలువురు నేతలు ఆ సందర్భంగా విమర్శించారు.